యాప్నగరం

వార్మప్ మ్యాచ్‌లో భారత్ దుమ్ముదులిపింది

మనీశ్ పాండే గాయపడటంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ దొరికిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం

TNN 30 May 2017, 6:55 pm
ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మెరుగైన ప్రదర్శనతో టచ్‌లోకి వచ్చేశారు. కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా బంగ్లాదేశ్‌తో మంగళవారం జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ (94: 77 బంతుల్లో 8x4, 1x6), హార్దిక్ పాండ్య (80 నాటౌట్: 54 బంతుల్లో 6x4, 4x6), ఓపెనర్ శిఖర్ ధావన్ (60: 67 బంతుల్లో 7x4) మెరుపులతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ భారత్ జట్టులోకి వచ్చిన ఓపెనర్ రోహిత్ శర్మ (1) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరిపోయి నిరాశపరిచాడు. కొద్దిసేపటికే అజింక్య రహానె (21) కూడా ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో బంతిని వికెట్లపైకి ఆడుకుని ఔటవడంతో భారత్ 21/2తో ఆత్మరక్షణలో పడింది.
Samayam Telugu india vs bangladesh match
వార్మప్ మ్యాచ్‌లో భారత్ దుమ్ముదులిపింది


ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోయినా.. మనీశ్ పాండే గాయపడటంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ దొరికిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. రహానె ఔట్ అనంతరం క్రీజులోకి వచ్చిన కార్తీక్ ఓపెనర్ ధావన్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ నిలబెట్టాడు. వీరిద్దరూ బంగ్లాదేశ్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా కోలుకుంది. జట్టు స్కోరు 121 వద్ద ధావన్ ఔటైనా.. కార్తీక్ మాత్రం తనదైన శైలిలో బౌండరీలు బాదేశాడు. అయితే జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్‌కి బ్యాటింగ్ అవకాశం రావాలనే ఉద్దేశంతో వ్యక్తిగత స్కోరు 94 వద్ద కార్తీర్ రిటైర్ట్ ఔట్‌గా వెనుదిరిగాడు. మధ్యలో కేదార్ జాదవ్ (31: 38 బంతుల్లో 2x4, 1x6), జడేజా (32: 36 బంతుల్లో 1x6) ఆశించిన మేర రాణించలేకపోయినా.. చివర్లో హార్దిక్ పాండ్య వరుస సిక్సర్లతో దుమ్ముదులిపేశాడు. చివరి బంతికి కళ్లు చెదిరే రీతిలో పాండ్య సిక్స్ బాదడంతో భారత్ 324 పరుగుల మెరుగైన స్కోరుతో బంగ్లా‌కి సవాల్ విసరగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.