యాప్నగరం

44ఏళ్ల కల.. నాలుగో ప్రయత్నంలో నెరవేర్చుకున్న ఇంగ్లండ్

ప్రపంచ విజేతగా నిలవాలన్న కలను ఇంగ్లండ్ 44ఏళ్ల తర్వాత నెరవేర్చుకుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి కప్పును సగర్వంగా ఎత్తుకుంది.

Samayam Telugu 15 Jul 2019, 10:12 am
క్రికెట్ ప్రపంచకప్ సంబరం ముగిసింది. సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్రపంచ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ టైగా ముగియగా.. సూపర్‌ ఓవర్లో ఆతిథ్య జట్టు చెమటోడ్చి నెగ్గి ప్రపంచకప్ సగర్వంగా అందుకుంది. 2015 ప్రపంచకప్‌లో దారుణ వైఫల్యం తర్వాత గోడకు కొట్టిన బంతిలా ఎగసిపడిన బ్రిటిష్ జట్టు నాలుగేళ్లలో వన్డేల్లో చెలాయించిన ఆధిపత్యం అంతాఇంతా కాదు. వన్డేల్లో ఇంగ్లండ్‌ టాప్-20 స్కోర్లలో 18స్కోర్లు 2015 ప్రపంచకప్ తర్వాతే నమోదయ్యాయంటే ఆ జట్టు ఆధిపత్యం ఎలా ఉందో గమనించవచ్చు.
Samayam Telugu pjimage


1975లో సొంత గడ్డపైనే జరిగిన తొలి ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్.. వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. ఈ ప్రపంచకప్ ముందు వరకు మూడుసార్లు ఫైనల్‌కు చేరుకున్న ఆ జట్టుకు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది. 1992 వరల్డ్‌కప్‌ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత ఏ ప్రపంచకప్‌లోనూ కనీసం సెమీస్ చేరలేకపోయింది. గత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలై కనీసం క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకపోవడంతో ఆ జట్టు పని అయిపోయిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అయితే 2019 ప్రపంచకప్ స్వదేశంలో జరగడంతో 44ఏళ్ల నిరీక్షణకు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టేయాలని ఇంగ్లండ్ సర్వశక్తులూ ఒడ్డింది. దాదాపు ఏడాది కాలంగా ఆ దేశ క్రికెట్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ జట్టును ఉత్సాహపరుస్తూ వస్తున్నారు. అయితే లీగ్ దశలో పడుతూ లేస్తూ సాగిన ఇంగ్లండ్ మూడోస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. అక్కడ డిపెండింగ్ ఛాంపియన్‌ ఆస్త్రేలియాను పసికూనలా మార్చేసి ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది.

భీకర ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్.. తనకంటే బలహీనంగా ఉన్న న్యూజిలాండ్‌ను ఘోరంగా ఓడించడం ఖాయమనుకున్నారంతా. కానీ మైదానంలోకి దిగాక సీన్ రివర్సయింది. రెండు జట్లు కొదమ సింహాల్లా పోరాడటంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌గా నిన్నటి మ్యాచ్(జులై 14) చరిత్ర పుటల్లోకి ఎక్కింది. న్యూజిలాండ్ 50 ఓవర్లలో 241 పరుగులు చేయగా.. సరిగ్గా ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లకు 241 పరుగులు చేసి ఆలౌటైంది.

దీంతో సూపర్ ఆడించగా అక్కడా రెండు సమానంగా 15 పరుగులు చేశాయి. అయితే ఇంగ్లండ్ రెండు బౌండరీలు కొట్టగా.. కివీస్ ఒక్క బౌండరీ బాదింది. ఈ సమీకరణాలతో ఇంగ్లండ్‌‌ను విజేతగా నిలవగా .. న్యూజిలాండ్ వరుసగా రెండోసారి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌ 44ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రపంచ విజేతగా నిలిచి కప్పును సగర్వంగా ఎత్తుకుంది. ఒకప్పుడు ప్రపంచాన్నే ఏలిన బ్రిటిష్ దేశం.. ప్రపంచ విజేతగా నిలవలేకపోయిందన్న చెడ్డపేరును మోర్గాన్ సేన చెరిపేసింది. ప్రపంచ విజేతల్లో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖింపజేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.