యాప్నగరం

IPL ఫైనల్ ముంబై, ఢిల్లీ మధ్యే: కామెంటేటర్ అంచనా

Mumbai Indians, Delhi Capitals మధ్యే ఐపీఎల్ 2020 ఫైనల్ జరిగే అవకాశం ఉందని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఓ ట్వీట్ చేశారు. దీనికి సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ మరో జట్టు పేరును తెర మీదకు తెచ్చారు.

Samayam Telugu 17 Oct 2020, 10:36 am
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 కీలక దశకు చేరుకుంటోంది. లీగ్ దశలో ఒక్కో జట్టు 8 చొప్పున మ్యాచ్‌లు ఆడింది. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ముంబై, ఢిల్లీ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆర్సీబీ 10 పాయింట్లతో మూడో స్థానంలో.. కోల్‌కతా 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 6 చొప్పున పాయింట్లతో.. తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Samayam Telugu dc vs mi | Image: IPL


ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే.. ముంబై, ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ జట్లు లీగ్ దశలో మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఇంకో 4 పాయింట్లు వస్తే చాలు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం పది పాయింట్లతో మూడోస్థానంలో ఉన్న ఆర్సీబీ.. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధిస్తే.. నెట్ రన్ రేట్ లాంటి సమీకరణలు అవసరం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

కాగా ఈ సీజన్లో ఢిల్లీ, ముంబై జట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. ఒకదానితో మరొకటి పోటీగా విజయాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం జట్ల ఆటతీరును పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ జరిగేలా కనిపిస్తోంది. క్రికెట్ కామెంటేటర్ ఆకాశో చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీ, ముంబై జట్ల మధ్యే ఐపీఎల్ తుది సమరం జరుగుతుందా? అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఆకాశ్ చోప్రా ట్వీట్‌కు సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ స్పందించారు. నీకు అరటి పండు తొక్క కనిపించడం లేదా? అంటూ చెన్నై సూపర్ కింగ్స్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ బదులిచ్చారు. ఫైనల్ చేరే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి అని అర్థం వచ్చేలా మూడీ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.