యాప్నగరం

BCCI: ‘కింగ్స్’ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బిగ్ ప్రమోషన్

Kings XI Punjab కెప్టెన్ కేఎల్ రాహు‌ల్‌కు బీసీసీఐ బిగ్ ప్రమోషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ.. రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది.

Samayam Telugu 27 Oct 2020, 7:57 am
ఐపీఎల్ 2020 ముగియగానే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. మూడు వన్డేలు, మూడు టీ20, నాలుగు టెస్టులు ఆడటం కోసం భారత ఆటగాళ్లు నేరుగా దుబాయ్ నుంచి ఆసీస్‌కు పయనం అవుతారు. ఈ పర్యటన కోసం బీసీసీఐ సోమవారం రాత్రి జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ టూర్‌‌కు దూరం కావడంతో.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను టీ20లు, వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.
Samayam Telugu kl-rahul
Image: BCCI/IPL


ఐపీఎల్ 2020లో 595 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న కేఎల్ రాహుల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఓ దశలో వరుస ఓటములతో కుదేలైన పంజబ్ జట్టు.. వరుసగా ఐదు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.

చాలా కాలంగా నిలకడగా రాణిస్తోన్న రాహుల్.. భారత క్రికెట్లో మూడో కీలక ఆటగాడిగా ఎదిగాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్సీ అప్పగించడం ద్వారా బీసీసీఐ అతడికి గుర్తింపు ఇచ్చినట్లయ్యింది. భవిష్యత్తులో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాల్సి వస్తే.. ఇది ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించడం, టెస్టు జట్టుకు సైతం ఎంపిక చేయడం పట్ల మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా హర్షం వ్యక్తం చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా రాహుల్ ఆటతీరు అద్భుతంగా ఉందని ప్రశంసించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.