యాప్నగరం

చెన్నై చేతిలో రాజస్థాన్ ఓటమికి కారణాలివే..!

ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో

Samayam Telugu 21 Apr 2018, 11:14 am
ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో వరుస తప్పిదాల కారణంగా 64 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి చవిచూసింది. చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించిన షేన్ వాట్సన్ (106 : 57 బంతుల్లో 9x4, 6x6) మ్యాచ్ ఆరంభంలోనే ఇచ్చిన రెండు క్యాచ్‌ల‌ను జారవిడిచిన రాజస్థాన్.. ఆ తర్వాత సురేశ్ రైనా(46: 29 బంతుల్లో 9x4)ను రనౌట్‌ చేసే అవకాశాన్ని కూడా పేలవ రీతిలో చేజార్చుకుంది. దీంతో.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
Samayam Telugu 99


లక్ష్య ఛేదనలోనూ రాజస్థాన్‌ జట్టు దొరికిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్ క్లాసెన్‌(7)కి తొలి ఓవర్‌లోనే ఓ జీవనదానం లభించినా.. అతను వినియోగించుకోలేకపోయాడు. ఆరంభంలోనే వికెట్ పడినా.. తర్వాత వచ్చిన సంజు శాంసన్ (2) బాధ్యతాయుతంగా ఆడకుండా.. పేలవ రీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. ఈ దశలో కెప్టెన్ అజింక్య రహానె (16: 11 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడినా.. బంతిని అంచనా వేయలేక స్ట్రైట్‌గా వచ్చిన బంతికి బౌల్డయ్యాడు. బెన్‌స్టోక్స్ (45: 37 బంతుల్లో 3x4, 1x6), జోస్ బట్లర్ (22: 17 బంతుల్లో 1x4, 1x6) మిడిల్ ఓవర్లలో నిలకడగా ఆడి రాజస్థాన్ శిబిరంలో ఆశలు రేపినా.. వారి ఔట్ అనంతరం రాహుల్ త్రిపాఠి (5), స్టువర్ట్ బిన్నీ (10) కూడా తక్కువ స్కోరుకే ఔటవడంతో.. రాజస్థాన్ జట్టు చివరికి 18.3 ఓవర్లలో 140 పరుగులకే ఆ జట్టు కుప్పకూలిపోయింది.

పేలవ ఫీల్డింగ్‌తో పాటు లయ తప్పిన బౌలింగ్‌ కారణంగా తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న రాజస్థాన్ జట్టు.. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ టోర్నీలో 200+ ఉన్న టార్గెట్‌ని కూడా ఛేదించిన జట్లు ఉన్నాయి. అవన్నీ.. పవర్‌ప్లేలోనే తమ విజయానికి బాటలు వేసుకోగా.. రాజస్థాన్ మాత్రం ఆరంభంలోనే 32/3తో ఢీలాపడి ఓటమిని ఖాయం చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.