యాప్నగరం

ఐపీఎల్ 2020లో మళ్లీ ఓడిన చెన్నై.. ఢిల్లీ‌కి రెండో గెలుపు

ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020 సీజన్‌లో తడబాటుని కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ని ఓడించిన ఆ జట్టు ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పేలవంగా ఓడిపోయింది.

Samayam Telugu 25 Sep 2020, 11:24 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుని ఓడించిన ఢిల్లీ టీమ్.. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌ని 44 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా (64: 43 బంతుల్లో 9x4, 1x6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన చెన్నై టీమ్ 131/7కే పరిమితమైంది. ఆ జట్టులో డుప్లెసిస్ (43: 35 బంతుల్లో 4x4) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహేంద్రసింగ్ ధోనీ (15: 12 బంతుల్లో 2x4) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు.
Samayam Telugu DC vs CSK IPL 2020 (Image Credit: IPL/Twitter)



176 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు మురళీ విజయ్ (10), షేన్ వాట్సన్ (14) తక్కువ స్కోరుకే ఔటవగా.. అనంతరం వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (5) నిరాశపరిచాడు. అయితే.. సూపర్ ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్ మొండిగా క్రీజులో నిలిచాడు. అతనికి కేదార్ జాదవ్ (26: 21 బంతుల్లో 3x4) కాస్త సపోర్ట్ ఇచ్చినా.. వేగంగా ఆడలేకపోయాడు. దాంతో.. ఆఖర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ధోనీ క్రీజులోకి వచ్చే సమయానికి చెన్నై జట్టు 26 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది. అయినప్పటికీ.. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి హిట్టింగ్‌కి ప్రయత్నించిన ధోనీ.. చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టగా.. నోర్తేజ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.


మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. ఢిల్లీ ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వీ షా, శిఖర్ ధావన్ (35: 27 బంతుల్లో 3x4, 1x6) జోడీ తొలి వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ధావన్ ఔటవగా.. 13వ ఓవర్‌‌లో పృథ్వీ షా పేలవరీతిలో స్టంపౌటయ్యాడు. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (37 నాటౌట్: 25 బంతుల్లో 6x4), శ్రేయాస్ అయ్యర్ (26: 22 బంతుల్లో 1x4) వేగంగా ఆడలేకపోయారు. కానీ.. ఆఖరి ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టాయినిస్ (5: 3 బంతుల్లో 1x4) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ 175 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్ వేసిన హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రెండో బంతిని పంత్‌ ఫోర్‌‌గా తరలించగా.. నాలుగు, ఐదో బంతిని ధోనీ పక్క నుంచి స్టాయినిస్ బౌండరీకి పంపాడు. ఇందులో ఒకటి లెగ్‌ బైస్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.