యాప్నగరం

బెంగళూరుకు గాయం దెబ్బ.. కీలక బౌలర్‌కు గాయం!

ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్ బెర్త్‌ ఖాయం చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు.

Samayam Telugu 26 Oct 2020, 3:15 pm
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్2లో 18వ ఓవర్ వేస్తున్న సమయంలో సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. సైనీ బొటన వేలి వెబ్బింగ్ (బొటన వేలు, చూపుడు వేలి మధ్య భాగం)లో చీలిక వచ్చిందని బెంగళూరు హెడ్ ఫిజియోథెరపిస్ట్ ఇవాన్ స్పీచ్‌లో తెలిపాడు.
Samayam Telugu Navdeep saini


‘సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. అతడి చేతి వేలి పక్క భాగంలో చీలిక వచ్చింది. అదృష్టవశాత్తూ మాకు మంచి హ్యాండ్ సర్జన్ ఉన్నాడు. అతడు చక్కగా కుట్లు వేశాడు. రాత్రంతా అతడి గాయాన్ని పర్యవేక్షిస్తాం. తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అని తర్వాత చెబుతాం’ అని స్పీచ్‌లీ తెలిపాడు.

‘నాలుగైదేళ్ల క్రితం కోల్‌కతాలో కోహ్లి కూడా ఇలాగే గాయపడ్డాడు. అప్పుడు ప్లాస్టిక్ సర్జన్ కుట్లు వేయడంతో బ్లీడింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కోహ్లి సెంచరీ కొట్టాడ’ని స్పీచ్‌లీ గుర్తు చేశాడు. ఈ రెండు గాయాలను పోల్చి చూడలేమన్న స్పీచ్‌లీ.. సైనీ బౌలింగ్ చేసే చేతికి గాయం కావడంతో.. అతడిపై ఒత్తిడి ఉంటుందన్నాడు. సైనీ తర్వాతి మ్యాచ్‌లో, ఐపీఎల్ మిగతా సీజన్లో ఆడొచ్చని స్పీచ్‌లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఆర్సీబీ తరఫున బౌలింగ్‌లో అదరగొడుతున్న సైనీ.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 28న ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.