యాప్నగరం

రాజస్థాన్‌పై అలవోకగా గెలిచిన హైదరాబాద్.. ప్లేఆఫ్ ఆశలు సజీవం

హైదరాబాద్ మళ్లీ జోరందుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌తో ఆకట్టకున్న సన్‌రైజర్స్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టేసింది.

Samayam Telugu 22 Oct 2020, 11:17 pm
ఐపీఎల్ 2020 సీజన్‌ ప్లేఆఫ్ అవకాశాల్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మనీశ్ పాండే (83 నాటౌట్: 47 బంతుల్లో 4x4, 8x6), విజయ్ శంకర్ (52 నాటౌట్: 51 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలు బాదడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో 10వ మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌కి ఇది నాలుగో గెలుపుకాగా.. 11వ మ్యాచ్‌ ఆడిన రాజస్థాన్‌కి ఇది ఏడో ఓటమి.
Samayam Telugu SRH vs RR (Photo Credit: IPL/Twitter)



మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్ బౌలర్లు జేసన్ హోల్డర్ (3/33), రషీద్ ఖాన్ (1/20), విజయ్ శంకర్ (1/15) దెబ్బకి టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో సంజు శాంసన్ (36: 26 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్‌కాగా.. ఓపెనర్‌గా ఆడిన బెన్‌స్టోక్స్ (30: 32 బంతుల్లో 2x4) నెమ్మది ఇన్నింగ్స్‌తో నిరాశపరిచాడు.


అనంతరం ఛేదనలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (4: 4 బంతుల్లో 1x4), జానీ బెయిర్‌‌స్టో (10: 7 బంతుల్లో 1x4, 1x6)లను జోప్రా ఆర్చర్ వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టించడంతో హైదరాబాద్ 2.4 ఓవర్లు ముగిసే సమయానికే 16/2తో నిలిచింది. కానీ ఈ దశలో విజయ్ శంకర్‌తో కలిసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన మనీశ్ పాండే మూడో వికెట్‌కి అజేయంగా 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మనీశ్ పాండే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడగా.. విజయ్ శంకర్ ఆఖర్లో లయ అందుకున్నాడు. దాంతో.. 18.4 ఓవర్లలోనే 156/2తో లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.