యాప్నగరం

SPB Death: సార్.. మళ్లీ అలా చేయాలనుంది, నాకది తీరని కల: దినేశ్ కార్తీక్ భావోద్వేగం

SP Balasubrahmanyam మరణం పట్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ భావోద్వేగానికి లోనయ్యారు. మీతో మళ్లీ ఒక్కసారి పాడించుకోవాలని ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.

Samayam Telugu 25 Sep 2020, 2:55 pm
సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీ పరిశ్రమతోపాటు సంగీత అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. కరోనా సోకడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన ఎస్పీబీ.. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆగస్టు 13 నుంచి ఆయన వెంటిలేటర్, ఎకో సపోర్ట్‌పై చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన కన్నుమూశారు.
Samayam Telugu balu dk | Image: Google


బాలసుబ్రహ్మణ్యం మరణం వార్త వినగానే క్రికెటర్ దినేశ్ కార్తీక్ భావోద్వేగానికి లోనయ్యారు. నిన్న, ఇవాళ దుర్వార్తలు వినాల్సి వచ్చిందంటూ డీన్ జోన్స్ మరణం గురించి, బాలు చనిపోయిన విషయాన్ని డీకే ప్రస్తావించారు.
‘‘నా ఫేవరేట్ ఆర్టిస్టుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం ఇవాళ మరణించారు. ఎస్పీబీ సార్‌ను కళాకారుడు అనడమే సరైంది. భారత సినీ చరిత్రలో గొప్ప గాయకులు, వైవిధ్య భరితమైన సింగర్లలో మీరు ఒకరు. మిమ్మల్ని ఈ ప్రపంచం ఎప్పటికీ ఇలాగే గుర్తుంచుకుంటుంది.
ఓసారి నేను మీ ఇంటికొచ్చాను. నా కోరిక మేరకు మీరెంతో ఓపికగా నాకు ఇష్టమైన పాటలు పాడి వినిపించారు. ఆ రోజును నేనెప్పటికీ మర్చిపోలేను. ఎస్పీబీ సార్.. నేను అబద్ధాలు చెప్పడం లేదు.. మళ్లీ ఒక్కసారి మీ ఇంటికొచ్చి.. మీతో పాటలు పాడించుకోవాలని ఉంది. కానీ ఇది నాకు జీవితాంతం తీరని కలగానే మిగిలిపోతుంది. మీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. నాలాంటి కోట్లాది మంది అభిమానులు ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ భావోద్వేగంతో ట్వీట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.