యాప్నగరం

KXIP vs SRH: పంజాబ్‌పై చేజేతులా ఓడిన హైదరాబాద్.. ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం

చేతిలోకి వచ్చేసిన మ్యాచ్‌ని తత్తరపాటులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జారవిడిచింది. స్లాగ్ ఓవర్లలో తడబడిన హైదరాబాద్ చివరి ఏడు వికెట్లని కేవలం 14 పరుగుల వ్యవధిలోనే చేజార్చుకోవడం గమనార్హం.

Samayam Telugu 25 Oct 2020, 12:09 am
ఐపీఎల్ 2020 సీజన్‌లో శనివారం సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవరీతిలో వికెట్లు చేజార్చుకుని ఓడిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించలేక 114 పరుగులకే ఆలౌటైంది. దాంతో.. 12 పరుగుల తేడాతో మ్యాచ్‌లో గెలుపొందిన పంజాబ్ టీమ్.. 11 మ్యాచ్‌లకిగానూ ఐదో విజయంతో ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోగా.. హైదరాబాద్ ఏడో ఓటమితో ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.
Samayam Telugu KXIP (Photo Credit: IPL/Twitter)



వాస్తవానికి ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (35: 20 బంతుల్లో 3x4, 2x6), జానీ బెయిర్‌స్టో (19: 20 బంతుల్లో 4x4) మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ 6.1 ఓవర్లు ముగిసే సమయానికి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. ఈ దశలో వార్నర్ ఔటవగా.. తర్వాత ఓవర్‌లోనే జానీ బెయిర్‌స్టో కూడా మురగన్ అశ్విన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కి ప్రయత్నిస్తూ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మనీశ్ పాండే (15: 29 బంతుల్లో) క్రీజులో నిలవగా.. అబ్దుల్ సమద్ (7) మాత్రం తేలిపోయాడు. కానీ.. మనీశ్ పాండే‌తో కలిసి హైదరాబాద్ ఇన్నింగ్స్ నిర్మించిన విజయ్ శంకర్ (26: 27 బంతుల్లో 4x4) బంతులు, పరుగుల మధ్య అంతరం పెరగకుండా బాధ్యత తీసుకున్నాడు. దాదాపు ఏడు ఓవర్ల పాటు ఓపికగా క్రీజులో నిలిచిన ఈ జోడీ హైదరాబాద్‌కి అలవోక విజయాన్ని అందించేలా కనిపించింది.


కానీ.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ నుంచి మ్యాచ్ నెమ్మదిగా పంజాబ్‌వైపు తిరిగింది. ఆ ఓవర్ వేసిన జోర్దాన్ మనీశ్ పాండేని ఔట్ చేయగా.. తర్వాత ఓవర్ వేసిన అర్షదీప్ విజయ్ శంకర్‌ని బోల్తా కొట్టించాడు. దాంతో.. హైదరాబాద్ విజయానికి చివరి 12 బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన జోర్దాన్.. వరుస బంతుల్లో జేసన్ హోల్డర్ (5), రషీద్ ఖాన్ (0) వికెట్లను పడగొట్టి.. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో.. సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారిపోగా.. ఆఖరి ఓవర్ వేసిన అర్షదీప్ సందీప్ శర్మ (0), ప్రియమ్ గార్గ్ (3)ని ఔట్ చేయగా.. ఐదో బంతికి ఖలీల్ అహ్మద్ (0) రనౌటయ్యాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో హైదరాబాద్‌కి వచ్చింది ఒక పరుగే. మరీ ముఖ్యంగా.. చివరి ఏడు వికెట్లనీ హైదరాబాద్ `14 పరుగుల వ్యవధిలోనే చేజార్చుకోవడం గమనార్హం.


మ్యాచ్‌లో అంతకముందు రషీద్ ఖాన్ (2/14), జేస్ హోల్డర్ (2/27), సందీప్ శర్మ (2/29) దెబ్బకి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో నికోలస్ పూరన్ (32 నాటౌట్: 20 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించిన కేఎల్ రాహుల్ (27: 27 బంతుల్లో 2x4, 1x6), మన్‌దీప్ సింగ్ (17: 14 బంతుల్లో 1x4) తొలి వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. అనంతరం వచ్చిన క్రిస్‌గేల్ (20: 20 బంతుల్లో 2x4, 1x6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటైపోయాడు. ఇక గ్లెన్ మాక్స్‌వెల్ (12) మరోసారి పేలవ ప్రదర్శనని కొనసాగించాడు. దాంతో.. నికోలస్ పూరన్ ఆఖరి వరకూ క్రీజులో ఉన్నా దూకుడుగా ఆడలేకపోయాడు. దీపక్ హుడా (0) కూడా స్టంపౌట్ ఔటవడం పంజాబ్‌ని స్లాగ్ ఓవర్లలో దెబ్బతీసింది. క్రిస్ జోర్దాన్ (7), మురగన్ అశ్విన్ (4) ఏమాత్రం పూరన్‌కి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. దాంతో.. పంజాబ్ టీమ్ 126 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.