యాప్నగరం

KKRకు షాక్.. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు

IPL 2020: కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ ఫీల్డ్ అంపైర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 11 Oct 2020, 7:35 am
ఐపీఎల్ 2020లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సునీల్ నరైన్.. బౌలింగ్ యాక్షన్‌ మరోసారి వివాదాస్పదమైంది. ఐపీఎల్ సస్పెక్టెడ్ ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్ పాలసీ ప్రకారం అంపైర్లు నరైన్ బౌలింగ్ యాక్షన్‌‌ను రిపోర్ట్ చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన జారీ చేసింది. నిబంధనల ప్రకారం నరైన్‌ను హెచ్చరిక జాబితాలో ఉంచుతారు. అతడు టోర్నీలో బౌలింగ్ చేయడానికి అనుమతి ఇస్తారు.
Samayam Telugu sunil narine | Image: iplt20.com/BCCI


కానీ మరోసారి నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై మరోసారి రిపోర్ట్ అందితే మాత్రం.. బీసీసీఐ సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ అతడి బౌలింగ్ సక్రమమే అని తేల్చేంత వరకు ఐపీఎల్ 2020లో అతడు బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తామని బీసీసీఐ తెలిపింది.

2014 నుంచి నరైన్ ఇబ్బందులు..
నరైన్ బౌలింగ్ యాక్షన్‌ విషయమై 2014 నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2014 ఛాంపియన్స్ లీగ్ సమయంలో రెండుసార్లు అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు అందింది. దీంతో 2015 వరల్డ్ కప్‌కు అతడు దూరమయ్యాడు. 2015 ఐపీఎల్ సమయంలోనూ అతడి బౌలింగ్‌ యాక్షన్‌ను రిపోర్ట్ చేశారు. అదే ఏడాది నవంబర్లో అతడు బౌలింగ్ చేయకుండా నిషేధించారు. ఐసీసీ 2016లో అతడి బౌలింగ్ యాక్షన్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ ఆ ఏడాది భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు అతడు దూరం కావాల్సి వచ్చింది. 2018లో పాకిస్థాన్ సూపర్ లీగ్ సమయంలో నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై మరోసారి రిపోర్ట్ చేశారు.

నరైన్ తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోవడం కోసం ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ కార్ల్ క్రౌ సహకారం తీసుకున్నాడు. నరైన్‌కు సాయం చేసేందుకు లీచెస్టర్‌కు చెందిన ఈ బయోమెకానిస్ట్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి దింపింది.

ఆఖరి ఓవర్లలో మ్యాజిక్..
శనివారం పంజాబ్‌, కోల్‌కతా జరిగిన మ్యాచ్‌లో.. కింగ్స్ ఎలెవన్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో సునీల్ నరైన్, ప్రసిద్ క్రిష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. కోల్‌కతా రెండు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (74), మయాంక్ అగర్వాల్ (56) 14.2 ఓవర్లలోనే 115 రన్స్ జోడించినప్పటికీ.. ఆఖర్లో వికెట్లు కోల్పోయిన పంజాబ్ 165 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.