యాప్నగరం

Matheesha Pathirana: ఆర్సీబీపై చెన్నై విజయం వెనుక లసిత్ మలింగ..!

Matheesha Pathirana: ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. శ్రీలంక యువ పేసర్ మథీష పథిరన డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై గెలుపొందింది. 20 ఏళ్ల మథీష బేబీ మలింగగా గుర్తింపు పొందాడు. అతడి బౌలింగ్ యాక్షన్ మలింగ తరహాలోనే ఉంటుంది. మలింగ బౌలింగ్ వీడియోలు చూస్తునే అతడు బౌలింగ్ చేయడం మొదలు పెట్టడం విశేషం.

Authored byరవి కుమార్ | Samayam Telugu 18 Apr 2023, 2:28 pm
ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేయగా.. బదులుగా బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 218 పరుగులకే పరిమితమైంది. చెన్నై జట్టులో డెవాన్ కాన్వే 45 బంతుల్లో 83 పరుగులు చేయగా.. శివమ్ దూబే (27 బంతుల్లో 52 రన్స్), అజింక్య రహానే (20 బంతుల్లో 37) రాణించారు.
Samayam Telugu RCB vs CSK
Baby Malinga Matheesha Pathirana bowling vs CSK


భారీ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తూ మొదటి ఓవర్లోనే ఔటయ్యాడు. 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ (33 బంతుల్లో 62), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76) విజయం దిశగా నడిపారు. కానీ వరుస ఓవర్లలో వీరిద్దరూ ఔట్ కావడం బెంగళూరును దెబ్బతీసింది.

చివరి మూడు ఓవర్లలో బెంగళూరు విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. 18వ ఓవర్ వేసే బాధ్యతను ‘బేబీ మలింగ’గా పేరొందిన లంక యువ పేసర్ మథీష పథిరనకు కెప్టెన్ ధోనీ అప్పగించాడు. తొలి బంతికే షహబాజ్‌ అహ్మద్‌ను ఔట్ చేసిన పథిరన.. ఆ ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చాడు. దీంతో ఆర్సీబీపై ఒత్తిడి పెరిగింది. 19వ ఓవర్లో తుషార్ దేశ్‌పాండే 12 రన్స్ ఇవ్వగా.. చివరి ఓవర్లో బెంగళూరు విజయానికి 19 రన్స్ అవసరం కాగా.. పథిరన 10 రన్స్ మాత్రమే ఇచ్చి ప్రభుదేశాయ్ వికెట్ తీశాడు. దీంతో చెన్నై 8 పరుగుల తేడాతో గెలుపొందింది.

శ్రీలంకకు చెందిన 20 ఏళ్ల పథిరన కేవలం మూడో ఐపీఎల్ మ్యాచ్‌ మాత్రమే ఆడుతున్నప్పటికీ.. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. పథిరన బౌలింగ్ యాక్షన్ శ్రీలంక మాజీ పేసర్ మలింగ యాక్షన్‌ను పోలి ఉంటుంది. 2022 ఐపీఎల్ వేలంలో అతణ్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ ఆడమ్ మిల్నే గాయపడటంతో చెన్నై సూపర్ కింగ్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పథిరన.. గిల్, హార్దిక్‌లను పెవిలియన్ చేర్చాడు. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. పథిరన అద్భుతమైన డెత్ బౌలర్ అని.. అతడి బౌలింగ్‌లో షాట్లు ఆడటం కష్టమని తెలిపాడు.
ఆర్సీబీపై చెన్నై గెలిచిన అనంతరం.. పథిరనను ప్రశంసిస్తూ లసిత్ మలింగ ట్వీట్ చేశాడు. మథీష ప్రదర్శన ఆకట్టుకుందన్నాడు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించిన విధానం తనకెంతో నచ్చిందన్నాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్ తనకు బౌలింగ్ సూచనలు ఇస్తున్న ఫొటోతో బదులిచ్చిన మథిష.. ధన్యవాదాలు చెప్పాడు. ఎప్పటిలాగే తనకు సపోర్ట్ చేయాలని కోరాడు. మలింగ బౌలింగ్ వీడియోలను చూస్తూ.. అతడిలాగే బౌలింగ్ చేయడం నేర్చుకున్న మథీష.. అతడిలాగే బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. మలింగను తన బౌలింగ్ ఆరాధ్య దైవం అని పథిరన చెబుతుంటాడు. ఏడాది క్రితం వరకు మలింగను అతడు ఒక్కసారే కలిశాడు. ఆ సమయంలో మరింత దూకుడుగా ఆడాలని మలింగ సూచించాడు. మథీష బాగా ఆడినప్పుడల్లా మలింగ అతణ్ని అభినందిస్తూ ట్వీట్లు చేస్తుంటాడు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.