యాప్నగరం

IPL Auction: స్టీవ్ స్మిత్‌పై కన్నేసిన ఆర్సీబీ? ఆ మూడు జట్లలో దక్కేది ఎవరికి?

Rajasthan Royals ఐపీఎల్ వేలానికి ముందు స్టీవ్ స్మిత్‌ను రిలీజ్ చేసింది. దీంతో అతడి కోసం మూడు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. కోహ్లి సేన స్మిత్ వైపు దృష్టి సారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Samayam Telugu 21 Jan 2021, 8:39 am
ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమకు అవసరం లేదని భావించిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రిలీజ్ చేయడం ఆశ్చర్యపరిచింది. అతడి స్థానంలో యువ ఆటగాడు సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. గత సీజన్‌ను మెరుగ్గానే ప్రారంభించిన రాజస్థాన్.. చివరికి వచ్చే సరికి మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. జట్టులో బోలెడంత మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. చివరి స్థానంలో ఉండటాన్ని రాజస్థాన్ మేనేజ్‌మెంట్‌తోపాటు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు.
Samayam Telugu smith_kohli_ipl_bcci
Image: BCCI


రాజస్థాన్ రిలీజ్ చేయడంతో.. ఐపీఎల్ వేలంలో పాల్గొనబోతున్న స్టీవ్ స్మిత్‌ కోసం మిగతా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. స్మిత్ లాంటి ఆటగాణ్ని కొనుగోలు చేయడం కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ వద్ద సరిపడా పర్సు మనీ లేదు. ఈ ఫ్రాంచైజీలు స్మిత్‌ను కొంటే.. మిగతా ఆటగాళ్ల విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్‌లో బ్యాటింగ్ విభాగం ఇప్పటికే ప్రధానంగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడి ఉంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ స్మిత్ వైపు చూసే అవకాశాల్లేవు.

ఇక స్మిత్‌ను కొనుగోలు చేసే అవకాశాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పర్సు మనీ రూ.53.2 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.35.7 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ.22.9 కోట్లు)కు మాత్రమే ఉన్నాయి. మిగతా జట్లతో పోలిస్తే మ్యాక్స్‌వెల్, కాట్రెల్ లాంటి విలువైన ఆటగాళ్లను వదిలేయడంతో పంజాబ్ దగ్గర ఎక్కువ డబ్బుంది. పంజాబ్‌కు మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్ అవసరం. దీంతో స్మిత్ పట్ల పంజాబ్ ఆసక్తి చూపే అవకాశం ఉంది.

ఇక కోహ్లి సేనను సైతం మిడిలార్డర్ సమస్య వెంటాడుతోంది. ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ, క్రిస్ మోరిస్, శివమ్ దూబేలను ఆ జట్టు రిలీజ్ చేసింది. ఆ జట్టు మంచి టాప్ ఆర్డర్ లేదా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ను కొనుగోలు చేయడం కోసం వేలంలో అడుగుపెట్టనుంది. కోహ్లి, డివిలియర్స్‌కు స్మిత్ లాంటి ఆటగాడు తోడైతే.. ఆర్సీబీకి ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది.

ఒకవేళ ఆర్సీబీ కాదనుకుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ స్మిత్‌ను తీసుకునే అవకాశం ఉంది. మురళీ విజయ్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్ లాంటి బ్యాట్స్‌మెన్ ఆ జట్టుకు దూరమయ్యారు. చెన్నై జట్టు దగ్గర రూ.22.9 కోట్లు ఉన్నాయి. గతంలో పుణే తరఫున స్మిత్, ధోనీ కలిసి ఆడారు. భవిష్యత్తులో కెప్టెన్సీ అవసరాల కోసం కూడా సీఎస్‌కే స్మిత్ కోసం వేలంలో పోటీ పడే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూస్తే.. రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ కోసం వేలంలో ఈ మూడు జట్లు పోటీ పడే ఛాన్స్ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.