యాప్నగరం

Mumbai Indians కి ఓటమి రుచి చూపిన యూపీ వారియర్స్.. జైత్రయాత్రకి తెర

WPL 2023లో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా కొనసాగిన ముంబయి ఇండియన్స్ జట్టుకి ఎట్టకేలకి యూపీ వారియర్స్ టీమ్ ఓటమి రుచి చూపింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబయిపై అలవోకగా గెలిచింది. చివర్లో టెన్షన్ పెట్టినా సిక్స్‌తో మ్యాచ్ ముగిసింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 18 Mar 2023, 7:31 pm

ప్రధానాంశాలు:

  • డబ్ల్యూపీఎల్ 2023లో ముంబయికి తొలి పరాజయం
  • లాస్ట్‌లో హైడ్రామా.. సిక్స్‌తో ముగింపు
  • మూడో విజయాన్ని అందుకున్న యూపీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mumbai Indians, UP Warriorz
యూపీ చేతిలో ఓడిన ముంబయి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023 (WPL 2023)లో ముంబయి ఇండియన్స్ జైత్రయాత్రకి యూపీ వారియర్స్ తెరదించింది. సీజన్‌ ఆరంభం నుంచి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్టుని శనివారం 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ (UP Warriorz) ఓడించేసింది. ఆరో మ్యాచ్ ఆడిన యూపీ టీమ్‌కి ఇది మూడో గెలుపుకాగా.. ముంబయి ఇండియన్స్‌కి తొలి ఓటమి ఇదే. అలానే డబ్ల్యూపీఎల్ 2023లో ముంబయికి ఓటమి రుచి చూపిన తొలి జట్టుగా యూపీ వారియర్స్ నిలిచింది.
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌటైంది. అనంతరం ఛేదనలో యూపీ వారియర్స్ టీమ్ విజయానికి చివరి 6 బంతుల్లో 5 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో వాంగ్ చేతికి ముంబయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంతినిచ్చింది. అయితే.. లాస్ట్ ఓవర్‌లో తొలి రెండు బంతుల్ని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వాంగ్ విసరగా.. యూపీ వారియర్స్ టీమ్ బ్యాటర్ ఎక్లెస్టోన్ కనీసం టచ్ కూడా చేయలేకపోయింది. దాంతో యూపీ టీమ్‌లో టెన్షన్ మొదలైంది. కానీ.. మూడో బంతిని ఫుల్ టాస్ రూపంలో విసరగా ఎక్లెస్టోన్ దొరికిందే ఛాన్స్ అన్నట్లు సిక్స్‌గా మలిచేసింది. దాంతో అప్పటి వరకు ముంబయి బౌలర్లు చేసిన పోరాటం వృథా అయిపోయింది.

అంతకముందు ముంబయి జట్టులో వాంగ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె 19 బంతుల్లో 4x4, 1x6 సాయంతో 32 పరుగులు చేసింది. సీజన్‌లో సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటైంది. అనంతరం ఛేదనలో యూపీ మిడిలార్డర్ బ్యాటర్లు మెక్‌గ్రాత్ 25 బంతుల్లో 38 పరుగులు, గ్రేస్ హారిస్ 28 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఆ జట్టు అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. ఈ ఇద్దరి ఔట్ తర్వాత మ్యాచ్‌లో అసలు మజా మొదలైంది. చివర్లో దీప్తి శర్మ (14 బంతుల్లో 13 పరుగులు ) వేగంగా పరుగులు రాబట్టలేకపోయినా ఎక్లెస్టోన్ సిక్స్ కొట్టడంతో యూపీ ఊపిరి పీల్చుకుంది.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.