యాప్నగరం

T20 World Cup యూఈఏ వేదికగా టీ20 వరల్డ్ కప్.. బీసీసీఐ నిర్ణయం షెడ్యూల్ కూడా ఫిక్స్!

భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను కరోనా వైరస్ కారణంగా యూఏఈ వేదికగా నిర్వహించడానికి బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Samayam Telugu 26 Jun 2021, 4:54 pm

ప్రధానాంశాలు:

  • కరోనా కారణంగా యూఏఈలో టీ20 టోర్నీ.
  • ఐపీఎల్ అనుభవంతో బీసీసీఐ నిర్ణయం.
  • అక్టోబరు 17 నుంచి మెగా టోర్నీ ఆరంభం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఐసీసీ టీ20 వరల్డ్ కప్
(Photo credit: @SGanguly99 Twitter)
దేశంలో కరోనా వైరస్ విజృంభణ వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మిగతా మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా, భారత్‌లో నిర్వహించాల్సిన ఐసీసీ టీ20 పురుషుల వరల్డ్ కప్‌ను కూడా యూఏఈకే తరలించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
శనివారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘‘దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పురుషల టీ20 వరల్డ్ కప్‌ను యూఏఈకి మార్చాలని భావిస్తున్నాం.. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం.. ఆటగాళ్ల ఆరోగ్యం, రక్షణే మాకు ముఖ్యం.. దీని త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని జై షా అన్నారు. టోర్నీ తరలింపుపై అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలయ్యే నాటికి దేశంలో కరోనా కేసులు అదుపులో ఉండగా.. టోర్నీ కీలక దశకు చేరుకున్న సమయానికి మహమ్మారి విజృంభించింది. పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడటంతో టోర్నీని మే తొలివారంలో అర్ధాంతరంగా రద్దుచేశారు.

గతేడాది కరోనా కారణంగా ఐపీఎల్‌ను దుబాయ్‌లోనే నిర్వహించిన బీసీసీఐ.. కరోనా అదుపులోకి వచ్చిందని భావించి స్వదేశంలోనే మ్యాచ్‌ల నిర్వహణకు మొగ్గుచూపింది. అయితే, అనూహ్యంగా కోవిడ్ కేసులు పెరిగిపోవడంతో ఐపీఎల్ 2021ను మధ్యలో నిలిపివేయాల్సి వచ్చింది. మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించినున్నట్టు ప్రకటించింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే టీ20 వరల్డ్ కప్‌ను కూడా విదేశంలోనే నిర్వహిస్తే ఎటువంటి అవంతారాలు ఉండవని భావిస్తోంది. అంతేకాదు, గతేడాది కరోనా సమయంలోనూ ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించగలిగేలా ఆతిథ్య దేశం ఏర్పాట్లు చేసింది.

అక్టోబరు 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 పురుషుల వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను యూఏఈకు మార్చడం గురించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి బీసీసీఐ అధికారికంగా లేఖ రాయాల్సి ఉంది. అయితే, అక్కడే టోర్నీ నిర్వహణకు ప్రణాళిక పూర్తిచేసినట్టు తెలుస్తోంది. టోర్నీ తొలి రౌండ్‌లో యూఏఈ, ఒమన్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

రౌండ్-1లో 12 మ్యాచ్‌లు ఉంటాయి.. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటాయి.. వీటిలో నాలుగు (ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు) సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పాపువా న్యూ గినియా - ఈ ఎనిమిది నుంచి నాలుగు జట్లు సూపర్ 12కు చేరుతాయి. తర్వాత టాప్ 8 జట్లతో కలిసి 30 మ్యాచ్‌లతో కూడిన రౌండ్-2 సూపర్ 12 అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.

సూపర్ 12లో జట్లు ఒక్కొక్కటి ఆరు గ్రూపులుగా విభజించి యుఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలోని మూడు వేదికలలో మ్యాచ్‌లు ఉంటాయి. దీని తరువాత మూడు ప్లేఆఫ్, రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.