యాప్నగరం

CSKలో ఆ సమస్యని ధోనీ చూసుకుంటాడు: క్రిస్‌ శ్రీకాంత్

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. చెన్నై టీమ్ ఆడిన ప్రతి సీజన్‌లోనూ కెప్టెన్‌గా ఆ జట్టుని ధోనీ ప్లేఆఫ్‌కి చేర్చాడు. ఈ క్రమంలో మూడు సార్లు ఆ టీమ్‌కి టైటిల్‌ని అందించిన ధోనీ..?

Samayam Telugu 13 Sep 2020, 7:28 pm
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కి ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఆగస్టు 20న అక్కడికి చేరుకున్న చెన్నై జట్టులో 13 మంది కరోనా వైరస్ బారినపడగా.. రిపోర్ట్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఐపీఎల్ 2020 నుంచి సురేశ్ రైనా తప్పుకుని భారత్‌కి వచ్చేశాడు. ఇక యూఏఈకి టీమ్‌తో కలిసి వెళ్లాల్సిన స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొన్ని రోజులు వేచి చూసి.. వ్యక్తిగత కారణాలతో తాను టోర్నీలో ఆడలేనంటూ బాంబ్ పేల్చాడు. మొత్తంగా.. ఇప్పుడు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ స్థానాల్ని ఎవరితో భర్తీ చేయాలనే మీమాంసలో చెన్నై ఉంది.
Samayam Telugu ​MS Dhoni
MS Dhoni and Dwayne Bravo. (Photo by Robert Cianflone/Getty Images)


చెన్నై జట్టుకి ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ తాజాగా యూట్యూబ్ షోలో మాట్లాడుతూ ‘‘రైనా లేకపోవడం చెన్నై టీమ్‌లో పెద్ద లోటు. ఒక బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. మంచి ఫీల్డర్, పార్ట్ టైమ్ బౌలర్, వైస్ కెప్టెన్.. మరీ ముఖ్యంగా ధోనీకి సలహాలిచ్చే వ్యక్తి రైనా. టీమ్‌లోనూ ఎనర్జీ నింపడంలో రైనా ముందుండేవాడు. ఇక యూఏఈ పిచ్‌లు స్పిన్‌కి అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి.. హర్భజన్ సేవలు కోల్పోవడం పెద్ద లోటు. అయితే చెన్నై టీమ్‌లో సమస్య ఏదైనా ధోనీ చక్కగా హ్యాండిల్ చేయగలడు’’ అని వెల్లడించాడు.

సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ స్థానాల్లో ఇప్పటి వరకూ ఎవరినీ తీసుకోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. రైనా రెగ్యులర్‌గా ఆడే నెం.3లో మురళీ విజయ్ లేదా అంబటి రాయుడ్ని ఆడించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హర్భజన్ దూరమైనప్పటికీ టీమ్‌లో రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ శాంట్నర్, కర్ణ్ శర్మ రూపంలో నలుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.