యాప్నగరం

BCCI వేటు వేసినా.. వెనక్కి తగ్గని చేతన్ శర్మ, అదే బాటలో మరో సెలక్టర్!

టీ20 వరల్డ్ కప్ ముగియగానే చేతన్ శర్మ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా నలుగురు సెలక్టర్లలో చేతన్ శర్మతోపాటు హర్విందర్ సింగ్ సైతం మరోసారి సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. సునీల్ జోషి, దేబశిష్ మహంతి మాత్రం దరఖాస్తు చేసుకోకుండా దూరంగా ఉన్నారు. క్రికెట్ బోర్డు ఓసారి వేటు వేసినప్పటికీ చేతన్ శర్మ తిరిగి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 1 Dec 2022, 9:31 am

ప్రధానాంశాలు:

  • చేతన్ శర్మ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ
  • పనితీరు బాగోలేకపోవడంతోనే గడువుకు ముందే వేటు
  • మరోసారి దరఖాస్తు చేసుకున్న చేతన్ శర్మ, హర్విందర్ సింగ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Former Selection Committee
Former Selection Committee
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ చేరలేపోవడంతో.. చేతన్ శర్మ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్యానెల్ కోసం దరఖాస్తులను సైతం బోర్డు ఆహ్వానించింది. మొత్తం 60 మందికిపైగా దరఖాస్తు చేసుకోగా.. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న చేతన్ శర్మతోపాటు సెలక్టర్ హర్విందర్ సైతం తిరిగి దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. నార్త్ జోన్ నుంచి చేతన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. హర్విందర్ సెంట్రల్ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సౌత్ జోన్‌కు చెందిన సెలక్టర్ సునీల్ జోషీ, ఈస్ట్ జోన్‌కు చెందిన దేబశిష్ మహంతీ సెలక్టర్ పోస్టు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోలేదు.
నలుగురు సెలక్టర్లలో కొందరు 2020లో సెలక్టర్లుగా నియమితులు కాగా.. మరికొందరు 2021లో నియమితులయ్యారు. సాధారణంగా జాతీయ సీనియర్ జట్టు సెలక్టర్లను నాలుగేళ్ల కాలానికి నియమిస్తారు. అవసరమైతే పదవీ కాలాన్ని పొడిగిస్తారు. కానీ వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యంతో గడువు ముగియక ముందే సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది.

సెలక్టర్‌గా దరఖాస్తు కోసం చేసుకోవడం కోసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బోర్డు నిబంధన విధించింది. దరఖాస్తుదారుడు కనీసం ఐదేళ్లకు ముందే క్రికెట్ నుంచి రిటైరై ఉండాలని కూడా నిబంధన విధించింది. నవంబర్ 28వ తేదీ వరకూ సెలక్టర్ పోస్టుల కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది.

సెలక్టర్లుగా పని చేయబోయే వ్యక్తులు.. జట్టు ప్రదర్శన విషయమై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ప్రతి మూడు నెలలకోసారి నివేదిక ఇవ్వాలని... ఒక్కో ఫార్మాట్‌కు కెప్టెన్‌ను నియమించాలని బోర్డు తన ప్రకటననలో పేర్కొంది. టీమ్‌కు సంబంధించిన ప్రశ్నలపై సెలక్షన్ కమిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడాలని కూడా బోర్డు నిబంధన విధించింది.

చేతన్ శర్మ ఆధ్వరంలోని సెలక్షన్ కమిటీపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ కమిటీ 2021 టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ఎంపిక చేసిన తీరు వివాదాస్పదం కాగా.. ఈసారి కూడా జట్టు ఎంపికపై ఆరోపణలొచ్చాయి. ముఖ్యంగా సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత బౌలర్లు తేలిపోవడం విమర్శలకు తావిచ్చింది. చేతన్ శర్మ, హర్విందర్ సింగ్ మరోసారి దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. వారి దరఖాస్తులను బోర్డు పక్కన బెట్టే అవకాశం ఉంది. సెలక్షన్ కమిటీ నియామకం కోసం బీసీసీఐ ముందుగా సలహా సంఘాన్ని ఏర్పాటు చేయనుందని సమాచారం.

Read More Sports News And Telugu news
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.