యాప్నగరం

సురేశ్ రైనా బాటలోనే హర్భజన్ సింగ్.. ఐపీఎల్ 2020కి దూరం

కరోనా వైరస్ భయంతో ఐపీఎల్ 2020 సీజన్‌ నుంచి సురేశ్ రైనా తప్పుకోగా.. అదే తరహాలో హర్భజన్ సింగ్ కూడా తాను టోర్నీకి దూరంగా ఉండనున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి సమాచారం అందించాడు.

Samayam Telugu 4 Sep 2020, 3:59 pm
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్‌కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి వైస్ కెప్టెన్ సురేశ్ రైనా తప్పుకోగా.. తాజాగా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరమయ్యాడు. గత కొద్ది రోజులుగా హర్భజన్ సింగ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె చెంత ఉండాలని భజ్జీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో.. ఇప్పుడు హర్భజన్ సింగ్ స్థానాన్ని భర్తీ చేసే స్పిన్నర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అన్వేషణ ప్రారంభించింది.
Samayam Telugu Harbhajan Singh
Harbhajan Singh


యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఆగస్టు 20న యూఏఈకి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చేరుకుంది. కానీ.. టీమ్‌తో కలిసి అక్కడికి వెళ్లని హర్భజన్ సింగ్.. భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే.. సెప్టెంబరు 1న యూఏఈకి వస్తానని తొలుత ఫ్రాంఛైజీకి సమాచారం ఇచ్చిన భజ్జీ.. ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. గత వారం చెన్నై టీమ్‌లో 13 కరోనా వైరస్ కేసులు నమోదవడంతోనే హర్భజన్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టోర్నీ మొత్తానికీ తాను దూరంగా ఉండనున్నట్లు ఫ్రాంఛైజీకి భజ్జీ సమాచారం ఇచ్చాడట.

ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడిన హర్భజన్ సింగ్.. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకూ 160 మ్యాచ్‌లాడిన ఈ స్పిన్నర్ 7.05 ఎకానమీతో 150 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా.. ఆరంభ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ.. వికెట్లు పడగొట్టడంలో హర్భజన్‌ సింగ్‌కి తిరుగులేదు. అందుకే 40 ఏళ్ల వయసులోనూ అతను చెన్నై టీమ్‌లో రెగ్యులర్‌ బౌలర్‌గా కొనసాగాడు. 2018 ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల వేలంలో రూ.2 కోట్లకి హర్భజన్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.