యాప్నగరం

ఇంగ్లాండ్ గడ్డపై.. చివరి టెస్టులో ఓటమి అంచున పాకిస్థాన్

ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్థాన్ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడిన పాకిస్థాన్.. చివరి టెస్టులోనూ ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. కానీ..?

Samayam Telugu 25 Aug 2020, 9:27 am
ఇంగ్లాండ్ టూర్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి టెస్టులో ఓడి.. రెండో టెస్టుని డ్రాగా ముగించిన పాకిస్థాన్.. ఇప్పుడు మూడో టెస్టుల్లోనూ ఓటమి అంచున నిలిచింది. సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న పాకిస్థాన్ నాలుగో రోజైన సోమవారం ఆట ముగిసే సమయానికి 100/2తో నిలిచింది. ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మంగళవారం మూడు సెషన్లపాటు ఇంగ్లాండ్ బౌలర్లని కాచుకోవాలి. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. ఇంగ్లాండ్‌కి 1-0తో మూడు టెస్టుల సిరీస్ సొంతంకానుంది.
Samayam Telugu England v Pakistan


శుక్రవారం ఆరంభమైన ఈ మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. జాక్ క్రాలీ (267: 393 బంతుల్లో 34x4, 1x6) డబుల్ సెంచరీ, జోస్ బట్లర్ (152: 311 బంతుల్లో 13x4, 2x6) శతకం బాదడంతో 583/8తో తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్ అజహర్ అలీ (141: 272 బంతుల్లో 21x4) సెంచరీ బాదినా 273 పరుగులకే ఆలౌటైంది.

310 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన పాకిస్థాన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది. ఓపెనర్లు షాన్ మసూద్ (18), అబిద్ అలీ (42) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోగా.. అజహర్ అలీ (29 బ్యాటింగ్: 92 బంతుల్లో 2x4), బాబర్ అజామ్ (4 బ్యాటింగ్: 16 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. దాంతో.. ఆటలో చివరి రోజైన మంగళవారం ఈ జోడీ ఎంత వరకూ పోరాడుతుంది..? అనేదానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. సౌథాంప్టన్ పరిసరాల్లో ఈరోజు వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.