యాప్నగరం

బౌలర్లు పుంజుకున్న తీరు అమోఘం: కోహ్లి

ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతమని కెప్టెన్ విరాట్ కోహ్లి కొనియాడాడు. ఈ

Samayam Telugu 9 Jul 2018, 12:45 pm
ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు పుంజుకున్న తీరు అమోఘమని కెప్టెన్ విరాట్ కోహ్లి కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్లు జేసన్ రాయ్, జోస్ బట్లర్ చెలరేగడంతో 7.4 ఓవర్లు ముగిసే సమయానికి 94/0తో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. ఈ దశలో పుంజుకున్న భారత బౌలర్లు వికెట్లు పడగొడుతూ ఆఖరికి ఆ జట్టుని 198/9కి కట్టడి చేయగలిగారు. అనంతరం రోహిత్ శర్మ (100 నాటౌట్: 56 బంతుల్లో 11x4, 5x6) అజేయ శతకం బాదడంతో భారత్‌ 18.4 ఓవర్లలోనే 201/3తో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌‌ని భారత్ 2-1తో చేజిక్కించుకోగా.. భారత్‌‌కి ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్‌ విజయం.
Samayam Telugu England v India - Second International T20


మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌లో భారత బౌలర్లు పుంజుకున్న తీరు అమోఘం. ఒకానొక దశలో ఇంగ్లాండ్‌ 225-230 స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. టీమిండియా బౌలర్లు మధ్యలో లయ అందుకుని క్రమంగా వికెట్లు పడగొట్టగలిగారు. టీ20 ఫార్మాట్‌లో 25-30 అదనపు పరుగులు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ని తప్పించి అదనపు పేసర్‌ దీపక్ చాహర్‌ని తుది జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమే. ఇకపై కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి’ అని వెల్లడించాడు.

పిచ్‌పై పచ్చిక ఎక్కువగా కనిపించడంతో కుల్దీప్ యాదవ్‌ని పక్కకి తప్పించి అతని స్థానంలో చాహర్‌ని జట్టులోకి తీసుకోగా.. మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహర్ 43 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే.. హార్దిక్ పాండ్య 4/38 కెరీర్‌లో బెస్ట్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ కట్టడిలో కీలకపాత్ర పోషించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.