యాప్నగరం

IND vs NZ: 4ఏళ్లు 2 బంతులు.. ఆఖరి నిమిషంలో సంజు శాంసన్‌పై వేటు

నాలుగేళ్ల తర్వాత టీ20ల్లో దొరికిన అవకాశాన్ని సంజు శాంసన్ చేజార్చుకోగా.. అతడ్ని నిమిషాల వ్యవధిలోనే న్యూజిలాండ్‌తో సిరీస్ రేసు నుంచి తప్పించి భారత్-ఎ జట్టులోకి ఎంపిక చేశారు.

Samayam Telugu 13 Jan 2020, 5:24 pm
న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టు‌లో సంజు శాంసన్‌కి అవకాశం దక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 24 నుంచి కివీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ని టీమిండియా ఆడనుండగా.. 16 మందితో కూడిన జట్టుని భారత సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో రిషబ్ పంత్‌ని వికెట్ కీపర్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు.. రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఎవరినీ ఎంపిక చేయలేదు. దీంతో.. సంజు శాంసన్‌కి అవకాశం దక్కలేదు.
Samayam Telugu fans slam selectors as sanju samson snubbed for india vs new zealand t20 series
IND vs NZ: 4ఏళ్లు 2 బంతులు.. ఆఖరి నిమిషంలో సంజు శాంసన్‌పై వేటు


భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ షైనీ, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్

నాలుగేళ్ల క్రితం భారత్ తరఫున టీ20ల్లో ఆడిన సంజు శాంసన్.. రెండు రోజుల క్రితం మళ్లీ టీ20 మ్యాచ్‌ ఆడాడు. కానీ.. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టి.. రెండో బంతికి వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో.. అప్పటి వరకూ కివీస్ టీ20 సిరీస్‌ రేసులో ఉన్న అతనిపై వేటు పడింది.

వాస్తవానికి ఆ మ్యాచ్ ముందు వరకూ కివీస్‌తో సిరీస్‌కి ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారట. కానీ.. ఆ మ్యాచ్‌లో 6 పరుగులు చేసి అతను ఔటవడంతో.. వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుని.. భారత్-ఎ జట్టుకి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ జట్టు ట్రోఫీని అందుకునే సమయంలో సంజు శాంసన్ అక్కడ లేడు. అప్పటికే భారత్-ఎ టీమ్‌కి రిపోర్ట్ చేయమని ఆదేశించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


న్యూజిలాండ్ పర్యటనకి ఈ నెల 17 నుంచే భారత్-ఎ జట్టు వెళ్లబోతోంది. కాబట్టి.. ఈ సిరీస్‌లో ఒకవేళ సంజు శాంసన్ మెరుగైన ప్రదర్శన చేయగలిగితే..? మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియాలోకి గత రెండు నెలలుగా ఎంపికవుతున్నా.. రిజర్వ్‌ బెంచ్‌పైనే అతడ్ని కూర్చోబెడుతుండటంపై ఇటీవల విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. కనీసం భారత్- ఎ టీమ్‌కి ఎంపిక చేయడం ద్వారా అతడికి ఆడే అవకాశం కల్పించాలని సెలక్టర్లు భావించినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.