యాప్నగరం

IND vs WI 3rd ODIకి గబ్బర్ వచ్చేస్తున్నాడు.. భారత కెప్టెన్ క్లారిటీ

కరోనా కారణంగా తొలి రెండు వన్డేలకీ దూరమైన శిఖర్ ధావన్.. మూడో వన్డేలో ఆడబోతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అలానే బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకి కూడా...

Samayam Telugu 10 Feb 2022, 11:19 am
వెస్టిండీస్‌తో శుక్రవారం జరగనున్న మూడో వన్డేకి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వారం క్రితం కరోనా వైరస్ బారినపడిన శిఖర్ ధావన్.. ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో రెండు సార్లు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల్లో కరోనా నెగటివ్ రావడంతో.. శిఖర్ ధావన్ తిరిగి జట్టుతో చేరాడు.
Samayam Telugu Team India (Pic Source: BCCI/Twitter)


తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడగా.. రెండో వన్డేలో రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడించింది. కానీ.. ఇద్దరూ ఓపెనర్లుగా ఫెయిలయ్యారు.
దానికితోడు.. బుధవారం జరిగిన రెండో వన్డేలో 44 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు.. మూడు వన్డేల సిరీస్‌ని 2-0తో సొంతం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో కాస్త ప్రయోగాలు చేయాలని భారత్ భావిస్తోంది. దాంతో.. జట్టులోని సీనియర్ ఆటగాళ్లకి రెస్ట్ ఇచ్చి బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకి అవకాశం దక్కనుంది.

‘‘మూడో వన్డేలో తుది జట్టులోకి శిఖర్ ధావన్ వస్తాడు. జట్టులో ప్రయోగాలు చేసేటప్పుడు ఒకవేళ ఓటమి ఎదురైనా మేము పట్టించుకోం. ఎందుకంటే.. మాకు జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం. ఫైనల్‌గా వన్డే జట్టుకి ఏ కాంబినేషన్ వర్కవుట్‌ అవుతుందో చూస్తున్నాం’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ని లక్ష్యం చేసుకుని భారత్ జట్టుని రోహిత్ శర్మ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.