యాప్నగరం

విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించండి.. ఆ ఫీలింగ్‌ని కూడా: వీవీఎస్ లక్ష్మణ్

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ నుంచి మధ్యలోనే విరాట్ కోహ్లీ వైదొలగడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కానీ.. అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు.

Samayam Telugu 21 Nov 2020, 7:21 am
ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి రావాలనుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. నవంబరు 27 నుంచి కంగారూలతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా ఆడనుండగా.. తొలి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు. జనవరి ఆరంభంలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని కోహ్లీ ఆశిస్తున్నాడు. దాంతో.. బీసీసీఐ కూడా అతనికి పితృత్వ సెలవుల్ని కేటాయించింది.
Samayam Telugu Virat Kohli (Image Source: Twitter)


‘‘విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలి. అవును.. కోహ్లీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్.. కానీ.. అతను కూడా ఫ్యామిలీ మ్యానే. కాబట్టి.. కుటుంబానికి అవసరమైనప్పుడు టైమ్‌ని కేటాయించాలి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ అది కీలకమైన ఘట్టం. గతంలో నేను కూడా నా భార్య ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండేందుకు రెండు రంజీ మ్యాచ్‌లకి దూరంగా ఉన్నాను. అదో మధురమైన జ్ఞాపకం.. మరీ ముఖ్యంగా.. భార్య తొలి బిడ్డ ప్రసవ సమయంలో’’ అని వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు.

డిసెంబరు 17 నుంచి 21 వరకూ అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు. అతని స్థానంలో అజింక్య రహానె మిగిలిన మూడు టెస్టుల్లోనూ కెప్టెన్‌గా టీమిండియాని నడిపించబోతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. బయో- సెక్యూర్ బబుల్‌లో ఈ సిరీస్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్వహిస్తుండటంతో.. అనుష్క శర్మ డెలివరీ తర్వాత కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియాకి వెళ్లి సిరీస్‌లో ఆడేందుకు అవకాశం లేకపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.