యాప్నగరం

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వరల్డ్‌కప్ హీరో గౌతం ‘గంభీర్’

గౌతం గంభీర్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. అభిమానులను షాక్‌కు గురిచేశాడు.

Samayam Telugu 4 Dec 2018, 11:53 pm
టీమిండియా నుంచి మరో దిగ్గజ ఆటగాడు నిష్క్రమించాడు. మాజీ ఓపెనర్, సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అనూహ్య నిర్ణయం ప్రకటించాడు. తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇకపై ఏ ఫార్మాట్‌లోనూ కొనసాగనని స్పష్టం చేశాడు. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 4) రాత్రి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. భావోద్వేగ వీడియోను షేర్ చేశాడు. ఆటతో అనుబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. 37 ఏళ్ల గంభీర్‌ భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.
Samayam Telugu Gambhir


2004 నుంచి 2016 వరకు అతడి కెరీర్‌ దిగ్విజయంగా సాగింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు 41.95 సగటుతో 4,154 పరుగులు చేశాడు. 9 శతకాలు, 22 అర్ధ శతకాలు నమోదు చేశాడు. భారత జట్టులోకి పునరాగమనం కోసం కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో గంభీర్‌ కూడా ఒకడు కావడం విశేషం. 2007 టీ20 ఫైనల్, 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. రెండింట్లోనూ గౌతం టాప్ స్కోరర్ కావడం మరో విశేషం.

భారత్‌ జట్టుకు దూరమైనా.. ఐపీఎల్‌లో తనదైన ఆటతీరుతో గంభీర్ ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సారథ్యం వహించిన గౌతీ.. ఆ జట్టుకు రెండుసార్లు కప్పు అందించాడు. అయితే.. గత సీజన్లో ఢిల్లీ తరపున ఆడిన గంభీర్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగైదు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన గంభీర్.. తనకు తానుగా జట్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత పంత్‌కు ఢిల్లీ సారథ్య బాధ్యతలు అందించారు.

గత సీజన్లో గంభీర్‌ పేలవ ప్రదర్శన చేయడంతో ఢిల్లీ జట్టు అతణ్ని సీజన్‌కు వదులుకుంది. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ మ్యాచ్ ఆడతాడనుకుంటే..
టీమిండియాకు దూరమైన గంభీర్‌.. దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌ లీగుల్లో మాత్రమే ఆడుతూ వచ్చాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గురువారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో గంభీర్‌ ఆడనున్నాడు. ఇదే అతడికి చివరి మ్యాచ్ కానుంది. గంభీర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.



ఆటతోనే కాదు.. వ్యక్తిత్వంతోనూ..
2016లో ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌ ఆడిన గంభీర్‌.. 2013లో ఇంగ్లండ్‌తో చివరి వన్డేను ఆడాడు. పాకిస్థాన్‌పై 2012లో చివరి టీ20 ఆడాడు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో 97 పరుగులతో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన గంభీర్‌ను అభిమానులు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారు. ఆటతో పాటు వ్యక్తిత్వంతోనూ అభిమానులపై గౌతీ తనదైన ముద్ర వేశారు.

గంభీర్ ఆటలో దేశం కోసం పోరాడాలనే తపన ప్రస్ఫుటంగా కనిపించేది. వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు అండగా నిలబడ్డా.. పేదల కోసం స్పందించినా, అనాథ పిల్లల కోసం విరాళాలు అందించినా.. అవన్నీ గంభీర్ మంచి మనసు, దేశంపై అతడికి ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనాలే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.