యాప్నగరం

ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 ప్రకటన.. భారత్‌ నుంచి కోహ్లి, సూర్య సహా ముగ్గురికి చోటు!

ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022ను ప్రకటించింది. ఇంగ్లాండ్‌కు టీ20 వరల్డ్ కప్‌ను అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో ఈ జట్టును ప్రకటించారు. గత ఏడాది సెమీస్‌లోనే టీ20 వరల్డ్ కప్‌‌లో పోరాటాన్ని ముగించిన భారత్ నుంచి అత్యధికంగా ముగ్గురు ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు లభించింది. పాక్ నుంచి ఇద్దరికి చోటు దక్కగా.. ఇంగ్లాండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్ నుంచి ఒక్కరు చొప్పున ఈ జట్టులో ఉన్నారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 23 Jan 2023, 6:19 pm
ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022ను ప్రకటించింది. గత ఏడాది పొట్టి ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసిన 11 మంది ఆటగాళ్లందర్నీ కలిపి ఓ జట్టుగా ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన జోస్ బట్లర్‌ను ఈ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. భారత్‌ నుంచి ఈ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. మూడో స్థానంలో విరాట్ కోహ్లిని, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యను ఎంపిక చేసింది.
Samayam Telugu Kohli-Surya
Virat Kohli And Suryakumar Yadav


జోస్ బట్లర్‌‌తోపాటు పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను ఓపెనర్లుగా ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌‌ను ఐదో స్థానానికి ఎంపిక చేసింది. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజాను ఆరో స్థానానికి, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను ఏడో స్థానానికి ఎంపిక చేసిన ఐసీసీ.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్‌ను 8వ స్థానానికి ఎంపిక చేసింది. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ, పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్, ఐర్లాండ్ పేస్ బౌలర్ జోష్ లిటిల్‌లను మిగతా స్థానాలకు ఎంపిక చేసింది.

జోస్ బట్లర్: జూన్ 2022లో ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ తర్వాత జోస్ బట్లర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2022 బట్లర్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అదరగొట్టే ప్రదర్శన చేశాడు. తొలి ఐసీసీ టోర్నీలోనే ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపాడు. 15 మ్యాచ్‌ల్లో 160కిపైగా స్ట్రైక్ రేట్‌తో 462 రన్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఆరు మ్యా్చ్‌ల్లో 225 రన్స్ చేసిన బట్లర్ టోర్నీలో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మహ్మద్ రిజ్వాన్: 2021లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రిజ్వాన్.. 2022లోనూ అదే ఫామ్ కనబర్చాడు. గత ఏడాది రిజ్వాన్ 996 రన్స్ చేశాడు. అందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

విరాట్ కోహ్లి: రెండేళ్లకుపైగా ఫామ్‌లో లేక ఇబ్బందులు పడిన కోహ్లి 2022లో మళ్లీ మునపటి విరాట్‌ను గుర్తు చేశాడు. ఆసియా కప్‌లో 276 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అప్ఘాన్‌పై సెంచరీ బాదడం ద్వారా మూడేళ్ల సెంచరీల కరువును తీర్చుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లి.. అసాధ్యమనుకున్న దశలో భారత్‌కు విజయాన్ని అందించాడు. 296 పరుగులతో టోర్నీలో హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.

సూర్యకుమార్ యాదవ్: 2022లో టీ20ల్లో హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచిన సూర్య.. ఆ ఏడాది పొట్టి ఫార్మాట్లో 1164 రన్స్ చేశాడు. గత ఏడాది సూర్య టీ20ల్లో 187.43 స్ట్రైక్ రేట్‌తో రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో 189.68 స్ట్రయిక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.