యాప్నగరం

విరాట్ కోహ్లీ రనౌట్‌‌.. ఆస్ట్రేలియాకి గొప్ప ఊరట: స్పిన్నర్ లయన్

తొలి రెండు సెషన్లలో షార్ట్ పిచ్, బౌన్సర్ బంతుల్ని వదిలేస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ.. మూడో సెషన్‌లో మాత్రం చక్కగా ఫుల్ చేస్తూ కనిపించాడు. కానీ.. అజింక్య రహానె తొందరపాటు కారణంగా కోహ్లీ ఔటయ్యాడు.

Samayam Telugu 17 Dec 2020, 8:40 pm
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రనౌటవడం ఆస్ట్రేలియాకి గొప్ప ఊరటనిచ్చిందని ఆ టీమ్ స్పిన్నర్ నాథన్ లయన్ అభిప్రాయపడ్డాడు. అడిలైడ్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో మంచి టచ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ (74: 180 బంతుల్లో 8x4).. వైస్ కెప్టెన్ అజింక్య రహానె (42: 92 బంతుల్లో 3x4, 1x6)తో సమన్వయ లోపం కారణంగా రనౌటయ్యాడు. దాంతో.. తడబడిన భారత్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 233/6తో నిలిచింది.
Samayam Telugu Virat Kohli Run Out (Image Credit: Twitter)


ఇన్నింగ్స్ 77వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో అజింక్య రహానె బంతిని మిడాఫ్ దిశగా నెట్టి సింగిల్ కోసం విరాట్ కోహ్లీని పిలిచాడు. కానీ.. బంతి నేరుగా ఫీల్డర్ హేజిల్‌వుడ్ చేతుల్లోకి వెళ్లడంతో.. క్రీజు వెలుపలికి వచ్చిన రహానె సడన్‌గా ఆగిపోయి కోహ్లీని వెనక్కి వెళ్లిపోవాలని సూచించాడు. అయితే.. అప్పటికే పిచ్ మధ్యలోకి వెళ్లిపోయిన కోహ్లీ వెనక్కి తిరిగి క్రీజులోకి రాలేకపోయాడు. దాంతో.. హేజిల్‌వుడ్ నుంచి బంతిని అందుకున్న నాథన్ లయన్ బెయిల్స్‌ని ఎగరగొట్టడంతో.. కోహ్లీ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.

విరాట్ కోహ్లీ రనౌట్‌పై నాథన్ లయన్ మాట్లాడుతూ ‘‘విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు రనౌటవడం మ్యాచ్‌లో కీలక మలుపు. క్రీజులో కుదురుకుని అతను చక్కగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కోహ్లీ- రహానెలు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత.. కోహ్లీ వికెట్‌తో మళ్లీ మేము పుంజుకోగలిగాం. ఆ రనౌట్ ఆస్ట్రేలియాకి గొప్ప ఊరట.. సంతోషాన్నిచ్చింది’’ అని లయన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.