యాప్నగరం

విరాట్ కోహ్లీ ఒక్కడు కాదు ఇద్దరు.. ఆస్ట్రేలియాకి బెనిఫిట్: మెక్‌గ్రాత్

మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా పోరాడటం విరాట్ కోహ్లీ నైజం. అతను పోరాడటమే కాదు.. సహచరుల్లోనూ ఆ స్ఫూర్తిని కెప్టెన్‌గా అతను నింపగలడు. దాంతో.. బ్యాట్స్‌మెన్‌గానే కాదు.. కెప్టెన్‌గా కూడా అతడి సేవల్ని..?

Samayam Telugu 17 Nov 2020, 6:48 pm
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చివరి మూడు మ్యాచ్‌లకి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవడం కంగారూలకి కలిసిరానుందని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాకి చేరుకున్న టీమిండియా నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనుండగా.. తొలి టెస్టు ముగిసిన వెంటనే స్వదేశానికి కోహ్లీ వచ్చేయనున్నాడు. అతని భార్య అనుష్క శర్మ జనవరిలో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. కోహ్లీకి ఇప్పటికే పితృత్వ సెలవుల్ని బీసీసీఐ మంజూరు చేసింది. కోహ్లీ సిరీస్‌కి దూరమవడం ద్వారా రెండు విధాలుగా టీమిండియా నష్టపోనుందని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu Virat Kohli (Image Credits: AP)


‘‘కోహ్లీ గైర్హాజరీ సిరీస్‌పై ప్రభావం చూపనుంది. క్లాస్, క్వాలిటీ ప్లేయరైన కోహ్లీ సేవల్ని మూడు టెస్టుల్లో టీమిండియా కోల్పోవడం తీరని లోటు. అయితే.. ప్రసవం సమయంలో భార్య చెంత ఉండాలనే అతని ప్రేమని నేను అర్థం చేసుకోగలను. కానీ.. కోహ్లీ అంటే ఒక్కడు కాదు.. ఇద్దరు. ఒకరేమో బ్యాట్స్‌మెన్ అయితే.. మరొకరు కెప్టెన్. మైదానంలో కెప్టెన్‌గా దూకుడుని ప్రదర్శించే కోహ్లీ.. సహచరుల్లోనూ ఉత్సాహం నింపగలడు. ఇక బ్యాట్స్‌మెన్‌గానూ చెప్పేదేముంది..? కోహ్లీ లేని టీమిండియాపై ఆధిపత్యం కోసం ఆస్ట్రేలియా కచ్చితంగా ప్రయత్నిస్తుంది’’ అని మెక్‌గ్రాత్ వెల్లడించాడు.

ఆస్ట్రేలియా పర్యటనకి 2018-19‌లో వెళ్లిన టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. దాదాపు 71 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ జట్టు ఆ గడ్డపై టెస్టు సిరీస్‌ని గెలవగా.. ఆసియాలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టు టీమిండియానే కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.