యాప్నగరం

సిరీస్‌లో కోహ్లీ లేకపోయినా టీమిండియాతో ఈజీ కాదు: ఆసీస్ కోచ్

విరాట్ కోహ్లీ లేని టీమిండియా.. ఆస్ట్రేలియా బౌలర్ల ఎదురుదాడి ముందు నిలవగలదా..? 2018-19లో కంగారూలకి వారి సొంతగడ్డపైనే షాకిచ్చిన భారత్ మరోసారి వారికి పంచ్ ఇవ్వగలదా..?

Samayam Telugu 13 Nov 2020, 12:55 pm
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కి వచ్చేయనున్నాడు. అతని భార్య అనుష్క శర్మ జనవరిలో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో తొలి టెస్టులో ఆడనున్న కోహ్లీ.. మిగిలిన మూడు టెస్టులకీ దూరంగా ఉండనున్నాడు. ఇది ప్రత్యర్థి ఆస్ట్రేలియాకి కలిసొచ్చే అంశంగా అందరూ పరిగణిస్తుండగా.. ఆ టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ మాత్రం గతం మర్చిపోకూడదని తమ ఆటగాళ్లని హెచ్చరించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపైకి చేరుకున్న టీమిండియా.. నవంబరు 27 నుంచి వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది.
Samayam Telugu Team India


‘‘నేను గతంలోనే చెప్పాను.. ఇప్పుడూ చెప్తున్నా.. నేను చూసిన వాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. కేవలం అతని బ్యాటింగ్ ఆధారంగా నేను ఈ మాట చెప్పడం లేదు. మైదానంలో అతని ఫీల్డింగ్ ఎనర్జీ.. సహచరుల్లో ఉత్సాహం నింపే తీరు.. ఒక్కటేమిటి అన్నీ తానై టీమ్‌ని నడిపిస్తాడు. తొలి టెస్టు తర్వాత టీమ్‌కి అతను దూరమవడం టీమిండియాపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. కానీ.. ఇదే భారత్ జట్టు గత పర్యటనలో మమ్మల్ని ఓడించిన తీరు మర్చిపోలేం. కోహ్లీ లేకపోయినా.. ఆ టీమ్ చాలా మెరుగ్గా ఆడుతుంది’’ అని జస్టిన్ లాంగర్ వెల్లడించాడు.

2018-2019లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన టీమిండియా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాని దాని సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో ఓడించిన తొలి ఆసియా జట్టుగా రికార్డ్ నెలకొల్పిన భారత్.. 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.