యాప్నగరం

ఓపెనర్ పృథ్వీ షాపై వేటు వద్దు.. మరో ఛాన్స్ ఇవ్వండి: హస్సీ సూచన

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పృథ్వీ షా ఒకే తరహా షాట్ సెలెక్షన్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. రెండు సందర్భాల్లోనూ అతను కుడి కాలి పాదం గాల్లో ఉండగానే బంతి వెళ్లి వికెట్లని గీరాటేసింది.

Samayam Telugu 22 Dec 2020, 3:43 pm
అడిలైడ్ వేదికగా ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో విఫలమైన యువ ఓపెనర్ పృథ్వీ షాపై భారత్ వేటు వేయకపోతే మంచిదని ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ సూచించాడు. ఆ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 0, 4 పరుగులు చేసిన పృథ్వీ షా.. పేలవరీతిలో బౌల్డయ్యాడు. స్వింగ్ అవుతున్న బంతుల్ని ఏమాత్రం పాదాల కదలిక లేకుండా ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన పృథ్వీ షా మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
Samayam Telugu Prithvi Shaw (Image Credit: AFP)


మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షాకి బదులుగా కేఎల్ రాహుల్ లేదా శుభమన్ గిల్‌ని ఆడించాలని అందరూ సూచనలు చేస్తున్నారు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆరంభ ఓవర్లలోనే పృథ్వీ షా వికెట్ చేజార్చుకోవడం టీమిండియాని దెబ్బతీసిందని.. అతనికి వికెట్ విలువ తెలియదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో.. రెండో టెస్టుకి అతనిపై వేటు పడటం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

‘‘భారత సెలెక్టర్లు పృథ్వీ షాపై నమ్మకం ఉంచాలి. నిజమే.. అడిలైడ్ టెస్టులో అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు.. పరుగులు చేయడంలోనూ విఫలమయ్యాడు. కానీ.. టూర్‌లో అతను ఆడింది ఒక టెస్టు మ్యాచే కదా..? అది కూడా బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై.. ఆస్ట్రేలియా లాంటి నాణ్యమైన బౌలింగ్‌ని ఎదుర్కొని పరుగులు రాబట్టాలంటే కష్టమే. కాబట్టి.. మెల్‌బోర్న్ టెస్టులోనూ అతనికి అవకాశమివ్వాలి. ఆ పిచ్ అడిలైడ్‌లా ఉండదు.. పృథ్వీ షా బ్యాటింగ్‌కి చక్కగా నప్పుతుంది. పేస్, బౌన్స్ కూడా పెద్దగా ఉండదు’’ అని హస్సీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.