యాప్నగరం

ధోనీ వ్యూహంతో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా..? జడేజా నిజాయతీ

అంతర్జాతీయ క్రికెట్‌కి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. అతని పోషించిన ఫినిషర్ బాధ్యతని రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Samayam Telugu 3 Dec 2020, 8:09 am
ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ని చేజార్చుకున్న టీమిండియా.. ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకుని ఒకానొక దశలో 152/5తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఆరో వికెట్‌కి అజేయంగా 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7x4, 1x6) - రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5x4, 3x6) జోడీ టీమిండియాకి 302 పరుగుల గౌరవప్రదమైన స్కోరుని అందించింది. వాస్తవానికి హిట్టర్లుగా పేరొందిన ఈ ఇద్దరి నుంచి ఈ తరహా భాగస్వామ్యాన్ని ఎవరూ ఊహించలేదు. కానీ.. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన ఈ జోడీ.. స్లాగ్ ఓవర్లలో వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయింది. ఎంతలా అంటే..? చివరి 7 ఓవర్లలో భారత్ ఏకంగా 93 పరుగుల్ని పిండుకుంది.
Samayam Telugu MS Dhoni, Ravindra Jadeja (Image Credits: Twitter)


భారత్‌కి గౌరవప్రదమైన స్కోరుని అందించేందుకు ధోనీ వ్యూహం తమకి దోహదపడిందని మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా నిజాయతీగా వెల్లడించాడు. ‘‘ధోనీ సుదీర్ఘకాలం టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడాడు. అతను తొలుత భాగస్వామ్యం నిర్మించేందుకు ప్రాధాన్యం ఇచ్చి.. క్రీజులో సెటిలైన తర్వాత భారీ షాట్లు ఆడేవాడు. ధోనీ బ్యాటింగ్‌ని నేను ఎన్నోసార్లు చూశాను.. అతనితో కలిసి ఆడాను. ఎప్పుడూ ధోనీ ఒక మాట చెప్తుండేవాడు.. మ్యాచ్‌ని మనం చివరి ఓవర్ వరకూ తీసుకెళ్లగలిగితే..? ఆఖరి 4-5 ఓవర్లలో భారీగా పరుగులు పిండుకోవచ్చని. అదే ప్లాన్‌తో నేను మూడో వన్డేలో ఆడా’’ అని రవీంద్ర జడేజా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి ఈ ఏడాది ఆగస్టులో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మూడు వన్డేల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్న భారత్ జట్టు.. డిసెంబరు 4 నుంచి మూడు టీ20ల సిరీస్.. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడబోతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.