యాప్నగరం

Sydney Test: జాతీయగీతం ఆలాపన టైమ్‌లో కన్నీళ్ల వెనుక కారణం చెప్పిన సిరాజ్

సిడ్నీ మైదానంలో జనగణమన పాడుతున్న సమయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. హైదరాబాద్‌కి చెందిన ఈ పేసర్ అలా ఎమోషనల్ అవడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించాడు.

Samayam Telugu 7 Jan 2021, 7:41 pm
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గురువారం ప్రారంభమైన మూడో టెస్టుకి ముందు జాతీయగీతం పాడుతున్న సమయంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కలచివేసింది. సిరాజ్ పక్కనే నిల్చొని ఉన్న మరో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి కూడా.. సిరాజ్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడో..? కొన్ని క్షణాలు అర్థం కాలేదు. కానీ.. కారణం తెలిసిన తర్వాత ఓదార్చే ప్రయత్నం చేశాడు. సిడ్నీ టెస్టులో ఈరోజు ఆట ముగిసిన తర్వాత తాను అలా ఎమోషనల్ కావడానికి గల కారణాన్ని మహ్మద్ సిరాజ్ స్వయంగా వెల్లడించాడు.
Samayam Telugu Mohammed Siraj Emotional (Image Credit: Twitter)



‘‘జాతీయగీతం పాడుతున్న సమయంలో మా నాన్న గుర్తొచ్చాడు. అందుకే అలా ఎమోషనల్ అయిపోయా. నేను భారత్ తరఫున టెస్టుల్లో ఆడాలని మా నాన్న ఎప్పుడూ కోరుకునేవాడు. ఒకవేళ ఇప్పుడు అతను జీవించి ఉంటే.. నన్ను చూసి ఆనందించేవాడు’’ అని మహ్మద్ సిరాజ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ ఉండగానే గత ఏడాది నవంబరు 20న అతని తండ్రి మహ్మద్ గౌస్ చనిపోయారు. బయో- సెక్యూర్ బబుల్ నిబంధనల కారణంగా అంత్యక్రియలకి కూడా ఈ పేసర్ హాజరుకాలేక.. టీమిండియాతో ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు.

వర్షం కారణంగా గురువారం 55 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా.. ఆస్ట్రేలియా 166/2తో ఈరోజుని ముగించింది. లబుషేన్ (67 బ్యాటింగ్), స్టీవ్‌స్మిత్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈరోజు మ్యాచ్‌లో 14 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 46 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అది కూడా ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లోనే.. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ది కావడం విశేషం. సిరాజ్ కెరీర్‌లో ఇది రెండో టెస్టు మాత్రమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.