యాప్నగరం

సిడ్నీ టెస్టులోనూ అశ్విన్ ఆడటం డౌటే..!

టీమిండియా విదేశీ పర్యటనకి ముందు ప్రధాన అస్త్రంగా కనిపించే అశ్విన్.. పర్యటన మధ్యలోనే గాయపడటం గత ఏడాదన్నరగా కొనసాగుతూనే ఉంది.

Samayam Telugu 1 Jan 2019, 5:54 pm
ఆస్ట్రేలియా‌తో గురువారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో తన పదునైన బౌలింగ్‌తో భారత్‌కి ఒంటిచేత్తో విజయాన్ని అందించిన అశ్విన్ ఆ తర్వాత పక్కటెముకల గాయం కారణంగా పెర్త్, మెల్‌బోర్న్ టెస్టులకి వరుసగా దూరమయ్యాడు. దీంతో.. పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఓడిన భారత్.. గత ఆదివారం ముగిసిన మెల్‌బోర్న్ టెస్టులో గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. సిడ్నీ పిచ్ స్పిన్‌కి అనుకూలించనుందని వార్తలు వస్తుండటంతో.. జడేజాతో పాటు అశ్విన్‌ని ఆడించాలని టీమిండియా యోచిస్తుండగా.. అతను ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu 300.


వాస్తవానికి టీమిండియా విదేశీ పర్యటనకి ముందు ప్రధాన అస్త్రంగా కనిపించే అశ్విన్.. పర్యటన మధ్యలోనే గాయపడటం గత ఏడాదన్నరగా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటన.. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలోనూ అశ్విన్ గాయాలతో ఇబ్బందిపడ్డాడు. తాజాగా కీలకమైన టెస్టు సిరీస్‌లోనూ అతను టీమ్‌కి దూరమయ్యాడు. ఒకవేళ సిడ్నీ టెస్టుకి అతను అందుబాటులో ఉండకపోతే మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవాలని భారత్ జట్టు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ.. తన భార్య రితిక ఆడబిడ్డకి జన్మనివ్వడంతో భారత్‌కి వచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో.. మిడిలార్డర్‌లో ఎవరిని ఆడించాలి..? అనే ఆలోచనలో ఉన్న భారత్‌కి అశ్విన్‌ గాయం కూడా కలవరపెడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.