యాప్నగరం

ఆస్ట్రేలియాపై సుందర్- ఠాకూర్ జోడీ ఎదురుదాడి.. శతక భాగస్వామ్యం

బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లకి సుందర్- ఠాకూర్ జోడీ షాకిచ్చింది. వన్డే తరహాలో హిట్టింగ్ చేసిన ఈ జంట ఏడో వికెట్‌కి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో..?

Samayam Telugu 17 Jan 2021, 11:54 am
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. ఆటలో మూడో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 62/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు.. రెండో సెషన్‌లో 186/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ (54 బ్యాటింగ్: 122 బంతుల్లో 7x4) - శార్ధూల్ ఠాకూర్ (67: 115 బంతుల్లో 9x4, 2x6) జోడీ అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఏడో వికెట్‌కి ఈ జోడీ 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా ప్రస్తుతం 309/7తో కొనసాగుతోంది.
Samayam Telugu Washington Sundar, Shardul Thakur (Image Source: BCCI/Twitter)



ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన శార్ధూల్ ఠాకూర్.. ఆరంభం నుంచి ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరీ ముఖ్యంగా.. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ని లక్ష్యం చేసుకుని వరుస బౌండరీలు బాదేశాడు. దాంతో.. వాషింగ్టన్ సుందర్‌లోనూ ఊపు వచ్చింది. అతనూ హిట్టింగ్ చేయడంతో వన్డే తరహాలో భారత్ స్కోరు బోర్డు పరుగులెత్తింది. శార్ధూల్ 90 బంతుల్లో 50 పరుగుల మైలురాయిని అందుకోగా.. సుందర్ 107 బంతుల్లో ఆ మార్క్‌ని అందుకున్నాడు. ఇద్దరికీ టెస్టు కెరీర్‌లో ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం.


విదేశీ గడ్డపై టెస్టుల్లో అదీ ఒకే ఇన్నింగ్స్‌ల్లో 7, 8 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లు హాఫ్ సెంచరీ సాధించడం 39 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌‌తో మాంచెస్టర్ వేదికగా 1982లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సందీప్ పాటిల్ (129), కపిల్ దేవ్ (65) అప్పట్లో ఈ రికార్డ్‌ని నెలకొల్పారు. మళ్లీ ఇన్నాళ్లకి సుందర్- ఠాకూర్ జోడీ.. ఆ ఘనతని సాధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.