పుణె వేదికగా శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో పర్యాటక ఇంగ్లాండ్కి 337 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య భారత్ జట్టు నిర్దేశించింది. కేఎల్ రాహుల్ (108: 114 బంతుల్లో 7x4, 2x6) సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రాహుల్తో పాటు రిషబ్ పంత్ (77: 40 బంతుల్లో 3x4, 7x6), విరాట్ కోహ్లీ (66: 79 బంతుల్లో 3x4, 1x6) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ కరన్, టాప్లే రెండేసి వికెట్లు పడగొట్టగా.. శామ్ కరన్, ఆదిల్ రషీద్ ఒక్కో వికెట్ తీశారు. మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. భారత్ ఇన్నింగ్స్ని ప్రారంభించిన ఓపెనర్లు శిఖర్ ధావన్ (4: 17 బంతుల్లో), రోహిత్ శర్మ (25: 25 బంతుల్లో 5x4) తక్కువ స్కోరుతో నిరాశపరచగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. మూడో వికెట్కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ.. టీమ్ స్కోరు 158 వద్ద ఔటవగా.. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ సిక్సర్లు బాదేశాడు. దాంతో.. రాహుల్లోనూ ఊపు వచ్చింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్కి 77 బంతుల్లోనే 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. సెంచరీ తర్వాత రాహుల్ ఔటయ్యాడు. చివర్లో పంత్ కూడా భారీ షాట్ ఆడబోయి వికెట్ చేజార్చుకున్నాడు. కానీ.. హార్దిక్ పాండ్య (35: 16 బంతుల్లో 1x4, 4x6) స్లాగ్ ఓవర్లలో చివరి వరకూ నిలిచి హిట్టింగ్ చేశాడు. ఇక తొలి వన్డేలో హాఫ్ సెంచరీ బాదిన అతని సోదరుడు కృనాల్ పాండ్యా (12 నాటౌట్: 9 బంతుల్లో 1x4) ఆఖర్లో బంతిని కనెక్ట్ చేసేందుకు ఇబ్బందిపడ్డాడు.
రెండో వన్డేలో ఇంగ్లాండ్ టార్గెట్ 337.. శతకం బాదిన కేఎల్ రాహుల్
రెండో వన్డేలో ఓపెనర్లు నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ సాయంతో.. టీమిండియాకి కేఎల్ రాహుల్ మెరుగైన స్కోరుని అందించాడు. స్లాగ్ ఓవర్లలో పంత్, హార్దిక్ పాండ్యా వరుస సిక్సర్లు బాదేశారు.
Samayam Telugu 26 Mar 2021, 5:39 pm
ప్రధానాంశాలు:
- ఇంగ్లాండ్పై రెండో వన్డేలో కేఎల్ రాహుల్ సెంచరీ
- హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్
- స్లాగ్ ఓవర్లలో సిక్సర్లుబాదిన హార్దిక్ పాండ్యా
- చివర్లో నిరాశపరిచిన కృనాల్ పాండ్యా