యాప్నగరం

కోహ్లీని పక్కా వ్యూహంతో బోల్తా కొట్టించారా..?

ఆరేళ్ల క్రితం కోహ్లీని వెంటాడిన బలహీనతని ఈరోజు టెస్టు మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఫస్ట్ ఊరించే బంతులతో కోహ్లీని కవ్వించిన కివీస్.. ఎట్టకేలకి ఫలితం రాబట్టగలిగింది.

Samayam Telugu 21 Feb 2020, 4:33 pm
న్యూజిలాండ్ గడ్డపై భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇటీవల టీ20, వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కోహ్లీ.. తాజాగా వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ తేలిపోయాడు. మ్యాచ్‌లో భారత్ జట్టు 35/2తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు.
Samayam Telugu New Zealand India Cricket


ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన జెమీషన్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా ఫుల్‌ లెంగ్త్ డెలివరీని విసిరాడు. దీంతో.. కొద్దిపాటి పాదాల కదలికలతో ముందుకు వచ్చిన విరాట్ కోహ్లీ బంతిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్‌ తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచింది. దీంతో.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాస్ టేలర్ సులువుగా క్యాచ్ అందుకున్నాడు.


వాస్తవానికి ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్లే బంతుల్ని వెంటాడటం కోహ్లీ అతి పెద్ద బలహీనత. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో కొంతమేర ఈ బలహీనతని అధిగమించిన కోహ్లీ.. 2018 ఇంగ్లాండ్ పర్యటనలో మళ్లీ ఆ బంతుల్ని వెంటాడుతూ వికెట్ చేజార్చుకున్నాడు. కానీ.. గత ఏడాది టెస్టుల్లో ఆ బంతుల జోలికి వెళ్లని కోహ్లీని తాజాగా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు ఊరించే బంతులు విసిరి మరీ బుట్టలో వేశారు.

కోహ్లీ వికెట్ పడగొట్టడంపై జెమీషన్ మాట్లాడుతూ ‘విరాట్ కోహ్లీ ఎక్కడైనా అలవోకగా పరుగులు రాబట్టగలడు. అందుకే.. అతని బలహీనతలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాం. స్టంప్‌ లైన్‌పై పడే బంతుల్ని కోహ్లీ సులువుగా బౌండరీకి తరలించగలడు. దీంతో.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతులు విసిరాం. నిజానికి కోహ్లీ ఔటైన బంతిని నేను ఆశించిన ప్రదేశంలో విసరలేకపోయాను. కానీ.. పిచ్ నుంచి కాస్త సహకారం లభించడంతో అతని వికెట్ సాధ్యమైంది’ అని వెల్లడించాడు. మ్యాచ్‌లో వర్షం కారణంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 122/5తో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.