యాప్నగరం

క్రికెట్‌లో ధోనీ, కోహ్లీ తర్వాత అతనే సూపర్ స్టార్..! : మైకేల్ వాన్

2007 టీ20 ప్రపంచకప్ తర్వాత సుదీర్ఘకాలం సూపర్ స్టార్ హోదాని క్రికెట్‌లో ధోనీ అనుభవించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆ స్థాయికి చేరుకోగా.. టీమిండియా నుంచి త్వరలోనే మరో సూపర్ స్టార్ రాబోతున్నట్లు..?

Samayam Telugu 7 Dec 2020, 2:04 pm
క్రికెట్‌లో మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో తన పవర్ హిట్టింగ్‌తో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా (42 నాటౌట్: 22 బంతుల్లో 3x4, 2x6).. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించాడు. బౌండరీ లైన్స్ దూరంలో ఉండే సిడ్నీ స్టేడియంలో చివరి ఓవర్‌లో అతను కొట్టిన రెండు సిక్సర్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయి.
Samayam Telugu Hardik Pandya (Image Credits: Twitter)


‘‘భారత్‌లో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగబోతోంది. అలానే ఏటా ఐపీఎల్‌ని కూడా భారత్‌లో నిర్వహిస్తుంటారు. దానికి తోడు 2023 వన్డే ప్రపంచకప్‌కి కూడా భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. ఈ నేపథ్యంలో.. క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా అవతరించేందుకు హార్దిక్‌ పాండ్యాకి ఇదో గొప్ప అవకాశం. ధోనీ సుదీర్ఘకాలం ఆ హోదాని అనుభవించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ స్థాయిలో ఉన్నాడు. అతని తర్వాత భారత్ తరఫున కాబోయే సూపర్ స్టార్ హార్దిక్ పాండ్య’’ అని మైకేల్ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో వరుసగా రెండు టీ20ల్లో గెలుపొందిన భారత్ జట్టు.. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. ఇక నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ మంగళవారం సిడ్నీ వేదికగా జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.