యాప్నగరం

ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో అమ్మాయిలు దంచేశారు..!

ఓటమి ఎరుగకుండా ప్రపంచకప్‌కి సగర్వంగా వెళ్తున్న భారత మహిళల జట్టు

TNN 21 Feb 2017, 6:26 pm
ఐసీసీ ప్రపంచకప్ క్వాలిఫయర్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలతో సగర్వంగా ముగించింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 245 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించిన మహిళలు ఔరా అనిపించింది. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని ఎదుర్కొన్న హర్మన్‌ప్రీత్ కౌర్ (41 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 41 పరుగులు) బంతిని ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించింది. కానీ అనూహ్యంగా ఫీల్డర్ బంతిని అందుకుని వేగంగా విసిరింది. దీంతో రెండో పరుగు కోసం ప్రయత్నించిన పూనమ్ యాదవ్ రనౌట్ రూపంలో వెనుదిరిగింది. తర్వాతి మూడు బంతులకు ఒక్క రన్ కూడా రాలేదు. దీంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ.. ఐదో బంతిని కళ్లు చెదిరే రీతిలో మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదిన హర్మన్‌ ప్రీత్ కౌర్.. చివరి బంతికి రెండు పరుగులు రాబట్టి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించింది.
Samayam Telugu india beat south africa in womens world cup qualifiers final
ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో అమ్మాయిలు దంచేశారు..!


కొలంబోలో జరిగిన ఈ ఫైనల్లో.. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 49.4 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనకు దిగిన భారత జట్టులో దీప్తి శర్మ 89 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 71 పరుగులతో సత్తా చాటింది. అయితే చివర్లో భారత్ తడబడినా.. హర్మన్‌ప్రీత్ కౌర్ హిట్టింగ్‌తో గెలిపించగలిగింది. ఈ విజయంతో జూన్‌లో జరగనున్న ప్రపంచకప్‌‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో భారత్ మహిళల జట్టు బరిలో దిగనుంది. క్వాలిఫయర్‌లో పోటీపడిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటిన భారత్ జట్టు ఇప్పటికే ప్రపంచకప్ బెర్తు ఖరారు చేసుకున్నప్పటికీ .. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో సగర్వంగా ముగించగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.