యాప్నగరం

బౌలర్లు భళా.. లంక 205 ఆలౌట్

నాగ్‌పూర్ టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో పర్యాటక జట్టు 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

TNN 24 Nov 2017, 4:05 pm
నాగ్‌పూర్: రెండో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లోనే 205 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆది నుంచి అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌలర్లు.. పర్యాటక జట్టుకు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. షమీ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న ఇషాంత్ శర్మ లంకను ఆరంభంలోనే దెబ్బతీశాడు. సమరవీర క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న పుజారా అద్భుతంగా అందుకోవడంతో భారత్‌కు తొలి వికెట్ లభించింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా రంగ ప్రవేశం చేసి తిరిమానే, మాథ్యూస్‌ను పెవిలియన్ చేర్చారు. దీంతో శ్రీలంక 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో లంక బ్యాటింగ్ నత్తను తలపించింది.
Samayam Telugu india bowl out sri lanka for 205 on the opening day of the second cricket test
బౌలర్లు భళా.. లంక 205 ఆలౌట్


ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ కరుణరత్నే (147 బంతుల్లో 51; 6 ఫోర్లు) పోరాడాడు. కానీ అద్భుత బంతితో ఇషాంత్ అతణ్ని ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అతడు అవుటయ్యాక.. స్పిన్నర్లు అశ్విన్, జడేజా వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో లంక కోలుకోలేకపోయింది. కానీ లంక కెప్టెన్ దినేశ్ చండీమల్ (122 బంతుల్లో 57; 4x4, 1x6) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ వరుసగా వికెట్లు పడటంతో.. 79.1 ఓవర్లలో 205 పరుగులకే లంక ఆలౌట్ అయ్యింది.


కోల్‌కతా టెస్టులో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటారు. అశ్విన్ 4 వికెట్లు తీయగా, జడేజాకు మూడు వికెట్లు దక్కాయి. పేసర్ ఇషాంత్ శర్మ ఓపెనర్ల వికెట్లను పడగొట్టడంతోపాటు.. లక్మల్‌ను అవుట్ చేశాడు. 16 ఓవర్లు వేసిన ఉమేష్ యాదవ్ 4 మెయిడిన్లు వేసినప్పటికీ.. వికెట్ మాత్రం దక్కలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.