యాప్నగరం

ఆఖరి టీ20లో బంగ్లాదేశ్ చిత్తు.. టీమిండియాదే సిరీస్

భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఏడు పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టడంతో ఛేదనలో బంగ్లాదేశ్ తేలిపోయింది. ఆఖర్లో చాహర్ హ్యాట్రిక్ వికెట్లు నమోదు చేయడం విశేషం. భారత పురుషుల జట్టు తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదవడం ఇదే తొలిసారి. మహిళల క్రికెట్‌లో ఏక్తా బిస్త 2012లో హ్యాట్రిక్ ఘనత సాధించింది.

Samayam Telugu 11 Nov 2019, 1:14 pm
భారత్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరిన బంగ్లాదేశ్‌‌‌కి భంగపాటు తప్పలేదు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తాచాటిన టీమిండియా 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ని చిత్తు చేసేసింది. భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ 6/7తో టీ20 చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో భారత్ చేజిక్కించుకోగా.. గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.
Samayam Telugu india crushes bangladesh clinches three match t20 series 2 1
ఆఖరి టీ20లో బంగ్లాదేశ్ చిత్తు.. టీమిండియాదే సిరీస్


undefined

మ్యాచ్‌లో తొలుత శ్రేయాస్ అయ్యర్ (62: 33 బంతుల్లో 3x4, 5x6), కేఎల్ రాహుల్ (52: 35 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్ మహ్మద్ నయిమ్ (81: 48 బంతుల్లో 10x4, 2x6) నిలకడగా ఆడటంతో బంగ్లాదేశ్ గట్టి పోటీనిచ్చేలా కనిపించింది. కానీ.. టీమ్‌లో అతనికి ఎవరూ సహకారం అందించలేకపోయారు. దీంతో.. ఆ జట్టు ఆఖరికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనని నమోదు చేయగా.. యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (3/30) కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పాడు.

Read More: టీ20లో రోహిత్ శర్మ బద్దకం.. గాల్లోకి ఎగిరిన వికెట్

వాస్తవానికి ఛేదనని 12/2తో పేలవంగా ఆరంభించిన బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. మహ్మద్ నయిమ్ అద్భుతంగా పోరాడాడు. కానీ.. సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్ రహీమ్ (0), ఆపిప్ హుస్సేన్ (0)లను గోల్డెన్ డక్ రూపంలో ఔట్ చేసేసిన టీమిండియా బంగ్లాదేశ్‌ని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. మధ్యలో కెప్టెన్ మహ్మదుల్లా (8) కాస్త బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది.

IND vs BAN 3rd T20 Trolls: ధోనీ శిష్యుడు మళ్లీ ఫెయిల్.. ఇక చాలు సాగనంపండి
మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. దీంతో.. శిఖర్ ధావన్ (19: 16 బంతుల్లో 4x4)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఔటైపోగా.. కొద్దిసేపు బ్యాట్ ఝళిపించిన ధావన్ కూడా జట్టు స్కోరు 35 వద్ద పెవిలియన్ చేరిపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కేఎల్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లని ఉతికారేసిన ఈ జోడీ మూడో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న రాహుల్.. ఆ వెంటనే ఔటైనా శ్రేయాస్ అయ్యర్ మాత్రం దూకుడు తగ్గించలేదు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఆపిప్ హుస్సేన్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6 బాదేసిన శ్రేయాస్ టీ20 కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 144 వద్ద శ్రేయాస్ ఔటవగా.. ఆఖర్లో శివమ్ దూబే (9 నాటౌట్: 8 బంతుల్లో)తో కలిసి మనీశ్ పాండే జట్టుకి మెరుగైన స్కోరుని అందించాడు.

Read More: టీ20 ఆఖరి ఓవర్.. 1, 6, 6, 6, 6, 6 (వీడియో)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.