యాప్నగరం

భారత్‌లోనే 2021 టీ20 ప్రపంచకప్.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ

2021 టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కుల కోసం భారత్‌తో తొలుత పోటీపడి.. ఆఖరిగా బుజ్జగింపులకి దిగిన ఆస్ట్రేలియాకి నిరాశే ఎదురైంది. ఆతిథ్య హక్కులు మార్చుకునేది లేదని ఐసీసీ మీటింగ్‌లో బీసీసీఐ తేల్చి చెప్పేసింది.

Samayam Telugu 7 Aug 2020, 8:28 pm
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పంతం నెగ్గించుకుంది. ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ టోర్నీని ఐసీసీ 2022కి వాయిదా వేసింది. అయితే.. తమకి భారత్ వద్ద ఉన్న 2021 టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) డిమాండ్ చేసింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కి కొన్ని ఏర్పాట్లు చేసినందున.. వచ్చే ఏడాది టోర్నీ నిర్వహణకి అవకాశం ఇస్తే తమకి లాభాదాయకంగా ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించింది. కానీ.. బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు.
Samayam Telugu ICC T20 World CUP
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్


టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కుల విషయంపై తాజాగా బీసీసీఐ, సీఏతో చర్చలు జరిపిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. బీసీసీఐని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ.. బీసీసీఐ మాత్రం ఒప్పుకోలేదు. దానికి కారణం.. 2023లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండటమే. ఒకవేళ వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కుల్ని ఆస్ట్రేలియాకి ఇస్తే..? అప్పుడు 2022లో టీ20 ప్రపంచకప్, 2023లో వన్డే ప్రపంచకప్‌‌ని బ్యాక్ టు బ్యాక్ బీసీసీఐ నిర్వహించాల్సి ఉంటుంది. అలా వరుసగా ఐసీసీ వరల్డ్‌కప్‌లు నిర్వహించడం బోర్డుకి తలకి మించిన భారమని భావించిన బీసీసీఐ.. సీఏ ప్రతిపాదనని తిరస్కరించింది. దాంతో.. టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్యం విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

భారత్ వేదికగా 2021 టీ20 ప్రపంచకప్‌ జరగనుండగా.. 2022 టీ20 ప్రపంచకప్‌కి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2023 వన్డే ప్రపంచకప్‌ మునుపటి షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే జరగనుంది. వాస్తవానికి ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌‌ వాయిదాకి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అంగీకరించడంతోనే ఐపీఎల్ 2020 సీజన్‌కి మార్గం సుగుమమైంది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనుండగా.. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ రద్దు అయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోయేది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.