యాప్నగరం

షాన్‌మార్ష్ శతకం.. రెండో వన్డేలో భారత్ టార్గెట్ 299

జట్టు స్కోరు 189 వద్ద క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. కుల్దీప్ యాదవ్ విసిరిన ఓ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన ఈ హిట్టర్.. ఆ తర్వాత భువీ బౌలింగ్‌లోనూ బ్యాట్ ఝళిపించాడు.

Samayam Telugu 15 Jan 2019, 2:01 pm
ఆస్ట్రేలియా గడ్డపై రెండో వన్డేలోనూ భారత్‌కి కంగారూలు కఠినమైన సవాల్ విసిరారు. అడిలైడ్ వేదికగా మంగళవారం జరుగుతున్న రెండో వన్డేలో షాన్ మార్ష్ (131: 123 బంతుల్లో 11x4, 3x6) సెంచరీ సాధించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు అరోన్ ఫించ్ (6: 19 బంతుల్లో), అలెక్స్ కేరీ (18: 27 బంతుల్లో 2x4) నిరాశపరిచినా.. పట్టుదలతో క్రీజులో నిలిచిన షాన్ మార్ష్ ఆఖర్లో హిట్టర్ మాక్స్‌వెల్ (48: 37 బంతుల్లో 5x4, 1x6)తో కలిసి జట్టుకి పోరాడే స్కోరు అందించాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (4/44) ఆకట్టుకోగా.. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (0/76) తేలిపోయాడు. తొలి వన్డేలోనూ 289 పరుగుల టార్గెట్‌ని ఆస్ట్రేలియా నిర్దేశించగా.. భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Samayam Telugu shaun_marsh_twitter_reactions_following_the_southpaws_century_knock_at_Adelaide_bulletinxp


రెండో వన్డేలోనూ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే.. సిరీస్‌లో ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న ఫించ్‌ని ఏడో ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ వరుసగా రెండోసారి బౌల్డ్ చేయగా.. తర్వాత ఓవర్‌లోనే మరో ఓపెనర్ అలెక్స్‌ కేరీని మహ్మద్ షమీ బుట్టలో వేశాడు. దీంతో.. 26/2తో నిలిచిన ఆస్ట్రేలియా జట్టుని ఉస్మాన్ ఖవాజా (21: 23 బంతుల్లో 3x4)తో కలిసి షాన్ మార్ష్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ఖవాజా రనౌటవగా.. అనంతరం వచ్చిన పీటర్ హ్యాండ్స్‌కబ్ (20: 22 బంతుల్లో 2x4) స్టంపౌటయ్యాడు. ఈ దశలో కాసేపు వికెట్ కాపాడుకున్న స్టాయినిస్ (29: 36 బంతుల్లో 3x4) హిట్టింగ్ చేసే ప్రయత్నంలో షమీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటవడంతో.. ఆస్ట్రేలియా మళ్లీ 189/5 ఇబ్బందుల్లో పడేలా కనిపించింది.

కానీ.. జట్టు స్కోరు 189 వద్ద క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. కుల్దీప్ యాదవ్ విసిరిన ఓ ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాదిన ఈ హిట్టర్.. ఆ తర్వాత భువీ బౌలింగ్‌లోనూ బ్యాట్ ఝళిపించాడు. ఈ క్రమంలో షాన్‌మార్ష్‌తో కలిసి ఆరో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. ప్రమాదకరంగా కనిపించిన అతడ్ని.. నకుల్ బంతితో భువీ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత రిచర్డ్ సన్ (2), పీటర్ సిడిల్ (0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే ఆఖరి ఓవర్‌లో బ్యాట్ ఝళిపించిన నాథన్ లయన్ (12 నాటౌట్: 5 బంతుల్లో 1x4, 1x6) ఓ సిక్స్, ఫోర్‌తో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ని ఘనంగా ముగించాడు.

ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా సిరీస్‌లో ఆస్ట్రేలియా శతకాల కరవుని షాన్ మార్ష్ తీర్చేశాడు. 108 బంతుల్లో 10x4 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న షాన్ మార్ష్‌కి వన్డే కెరీర్‌లో ఇది ఏడో శతకం. గత ఏడాది ఆఖరి నుంచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడినా.. కనీసం ఒక్క ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ సాధించలేకపోయారు. మరోవైపు భారత్ తరఫున మాత్రం సిరీస్‌లో ఇప్పటికే ఆరు శతకాలు నమోదయ్యాయి. ఇందులో పుజారా మూడు, కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ తలో ఒక శతకం బాదారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.