యాప్నగరం

అడిలైడ్ వన్డేలో భారత్ ఘనవిజయం..!

299 ఛేదనలో జట్టు స్కోరు 242 వద్ద కోహ్లీ ఔటవగా.. బ్యాక్ టు బ్యాక్ అర్ధశతకం బాదిన ధోనీ ఆఖరి వరకూ పట్టుదలతో క్రీజులో నిలిచి తన ఫామ్‌పై వచ్చిన విమర్శలకి మ్యాచ్ విన్నింగ్ షాట్‌తో బదులిచ్చాడు.

Samayam Telugu 15 Jan 2019, 5:47 pm
ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లో భారత్‌ లెక్కసరిచేసింది. అడిలైడ్ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (104: 112 బంతుల్లో 5x4, 2x6), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (55 నాటౌట్: 54 బంతుల్లో 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 299/4తో ఛేదించింది. టీమిండియా విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ (25 నాటౌట్: 14 బంతుల్లో 2x4)తో కలిసి సింగిల్స్‌ తీస్తూ సమయోచితంగా ఆడిన మహేంద్రసింగ్ ధోనీ.. ఆఖరి ఓవర్‌లో కళ్లుచెదిరే సిక్స్ బాది భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. ఇక సిరీస్‌లో విజేత నిర్ణయాత్మక మూడో వన్డే శుక్రవారం ఉదయం 7.50 గంటల నుంచి జరగనుంది.
Samayam Telugu o9bkkj0k_ms-dhoni-dismissal_625x300_12_January_19


ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (43: 52 బంతుల్లో 2x4, 2x6), శిఖర్ ధావన్ (32: 28 బంతుల్లో 5x4) జట్టుకి మెరుగైన ఆరంభమివ్వగా.. అంబటి రాయుడు (24: 36 బంతుల్లో 2x4) కాసేపే క్రీజులో నిలిచాడు. దీంతో.. స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకున్న విరాట్ కోహ్లీ- ధోనీ జోడీ.. నాలుగో వికెట్‌కి అభేద్యంగా 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కెరీర్‌లో 39వ శతకాన్ని అందుకున్నాడు. అయితే జట్టు స్కోరు 242 వద్ద కోహ్లీ ఔటవగా.. బ్యాక్ టు బ్యాక్ అర్ధశతకం బాదిన ధోనీ ఆఖరి వరకూ పట్టుదలతో క్రీజులో నిలిచి తన ఫామ్‌పై వచ్చిన విమర్శలకి మ్యాచ్ విన్నింగ్ షాట్‌తో బదులిచ్చాడు.

అంతకముందు షాన్ మార్ష్ (131: 123 బంతుల్లో 11x4, 3x6) సెంచరీ సాధించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు అరోన్ ఫించ్ (6: 19 బంతుల్లో), అలెక్స్ కేరీ (18: 27 బంతుల్లో 2x4) నిరాశపరిచినా.. పట్టుదలతో క్రీజులో నిలిచిన షాన్ మార్ష్ ఆఖర్లో హిట్టర్ మాక్స్‌వెల్ (48: 37 బంతుల్లో 5x4, 1x6)తో కలిసి జట్టుకి పోరాడే స్కోరు అందించాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (4/44) ఆకట్టుకోగా.. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (0/76) తేలిపోయాడు. తొలి వన్డేలోనూ 289 పరుగుల టార్గెట్‌ని ఆస్ట్రేలియా నిర్దేశించగా.. భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.