యాప్నగరం

ఆసీస్ గడ్డపై టీ20ల్లో కాలరెగరేసిన టీమిండియా.. 195 టార్గెట్ ఉఫ్

చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 14 పరుగులు అవసరం అవగా.. తొలి బంతికి డబుల్ తీసిన హార్దిక్ పాండ్య.. రెండో బంతిని సిక్స్‌గా స్టాండ్స్‌లోకి తరలించాడు. ఆ తర్వాత మూడో బంతి బౌన్సర్ రూపంలో పడగా.. నాలుగో బంతిని మళ్లీ స్టాండ్స్‌లోకి సిక్స్‌గా హార్దిక్ కొట్టేశాడు.

Samayam Telugu 6 Dec 2020, 5:37 pm
ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌ని భారత్ గెలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. శిఖర్ ధావన్ (52: 36 బంతుల్లో 4x4, 2x6), విరాట్ కోహ్లీ (40: 24 బంతుల్లో 2x4, 2x6), హార్దిక్ పాండ్య (42 నాటౌట్: 22 బంతుల్లో 3x4, 2x6) దూకుడుగా ఆడటంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 195/4తో విజయాన్ని అందుకుంది. భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఆండ్రూ టై బౌలింగ్‌‌లో రెండు ఫోర్లు బాది 11 పరుగులు రాబట్టిన హార్దిక్ పాండ్య.. చివరి ఓవర్ వేసిన డానియల్ శామ్ బౌలింగ్‌లో ఒక డబుల్, రెండు సిక్సర్లు బాదేశాడు. దాంతో.. మూడు టీ20ల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కోహ్లీసేన 2-0తో చేజిక్కించుకుంది. తొలి టీ20లోనూ 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందగా.. ఇక నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ సిడ్నీలోనే మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకి జరగనుంది.
Samayam Telugu Hardik Pandya (Image Credits: BCCI/Twitter)



195 పరుగుల ఛేదనలో భారత్‌కి ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ (30: 22 బంతుల్లో 2x4, 1x6) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఫస్ట్ పవర్‌ ప్లేలో పోటీపడి బౌండరీలు బాదిన ఈ జోడీ.. తొలి వికెట్‌కి 5.2 ఓవర్లలోనే 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ ఔటవగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ అదే జోరుని కొనసాగించాడు. ధావన్ ఔటయ్యే వరకూ ఆచితూచి ఆడిన కోహ్లీ.. స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో సిక్స్‌తో గేర్ మార్చాడు. మధ్యలో సంజు శాంసన్ (15: 10 బంతుల్లో 1x4, 1x6) కూడా విలువైన పరుగులు చేశాడు. కానీ.. జట్టు స్కోరు 149 వద్ద కోహ్లీ ఔటవడంతో టీమిండియాపై ఒత్తిడి పడింది. అయితే.. స్లాగ్ ఓవర్లలో శ్రేయాస్ అయ్యర్ (12 నాటౌట్: 5 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి సమయోచితంగా హిట్టింగ్ చేసిన హార్దిక్ పాండ్యా.. చివరి రెండు ఓవర్లలో తానే పూర్తిగా స్ట్రైక్ తీసుకుని మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు.


మ్యాచ్‌లో తొలుత కెప్టెన్ మాథ్యూవెడ్ (58: 32 బంతుల్లో 10x4, 1x6), స్టీవ్‌స్మిత్ (46: 38 బంతుల్లో 3x4, 2x6) దూకుడుగా ఆడటంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో నటరాజన్ (2/20) మినహా అందరూ తేలిపోయారు. తొలి టీ20లో మూడు వికెట్లు పడగొట్టిన చాహల్ (1/51) ధారాళంగా పరుగులిచ్చేయగా.. దీపక్ చాహర్ (0/48) నిరాశపరిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.