యాప్నగరం

కోహ్లీకి ఎరవేస్తే..? హార్దిక్ పాండ్యా చిక్కాడు.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్

విరాట్ కోహ్లీని ఔట్ చేయడం ద్వారా హార్దిక్ పాండ్యాని ఒత్తిడిలోకి నెట్టాలని ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ ప్లాన్ వేశాడు. ఆ మేరకు కోహ్లీకి ఊపిచ్చే బౌలర్‌ని రంగంలోకి దింపాడు. కానీ.. కోహ్లీ మాత్రం..?

Samayam Telugu 8 Dec 2020, 8:47 pm
ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌ని చేజిక్కించుకున్న టీమిండియా.. క్లీన్‌స్వీప్ అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకుంది. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు 174/7కే పరిమితమైంది. స్లాగ్ ఓవర్లలో విరాట్ కోహ్లీ (85: 61 బంతుల్లో 4x4, 3x6)తో జత కలిసిన హార్దిక్ పాండ్యా (20: 13 బంతుల్లో 1x4, 2x6) భారీ సిక్సర్లు బాదడంతో మ్యాచ్‌లో భారత్ గెలిచేలా కనిపించింది. కానీ.. ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్.. తెలివిగా స్పిన్నర్ ఆడమ్ జంపాని 18వ ఓవర్‌లో బౌలింగ్‌కి దింపి మ్యాచ్‌ని టీమిండియా నుంచి లాగేశాడు. వాస్తవానికి ఆ ఓవర్‌లో విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు జంపాని ఫించ్ బౌలింగ్‌కి దింపాడు. కానీ.. హార్దిక్ పాండ్యా తొలి బంతికే ఔటవడంతో కోహ్లీపై ఒత్తిడి పెరిగింది.
Samayam Telugu Hardik Pandya, Virat Kohli (Image Credits: AP)


భారత్ విజయానికి చివరి 30 బంతుల్లో 76 పరుగులు అవసరమైన దశలో.. 16వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన డేనియల్ శామ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదేశాడు. అదే ఓవర్‌లో హార్దిక్ పాండ్యా కూడా ఓ సిక్స్ కొట్టడంతో మొత్తంగా 20 పరుగులు వచ్చాయి. దాంతో.. ఒక్కసారిగా మ్యాచ్‌లో ఊపొచ్చింది. ఆ తర్వాత 17వ ఓవర్ వేసిన ఆండ్రూ టై బౌలింగ్‌లోనూ పాండ్యా ఫోర్, సిక్స్ బాదేశాడు. దాంతో.. మ్యాచ్ చేజారిపోతోందని గ్రహించిన ఫించ్.. ఆడమ్ జంపాని రంగంలోకి దింపాడు.

విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్లలో ఒకడిగా ఉన్న ఆడమ్ జంపా.. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో బౌలింగ్‌కిరాగా.. అప్పటికి టీమిండియా గెలుపు సమీకరణం 18 బంతుల్లో 43 పరుగులుగా ఉంది. అయితే.. తొలి బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా ఔటవడంతో.. మ్యాచ్‌పై భారత్ ఆశలు వదిలేసింది. ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ.. ఆ ఓవర్‌లో మొత్తంగా కేవలం 7 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. ఆ తర్వాత చివరి రెండు ఓవర్లలోనూ 23 పరుగులే రాబట్టిన టీమిండియా.. కోహ్లీ వికెట్ చేజార్చుకోవడంతో పాటు 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ‘‘హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చూసిన తర్వాత ఒకనొక దశలో టార్గెట్‌ని ఛేదిస్తామనుకున్నా. కానీ.. మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. ఒకవేళ నేను, పాండ్యా కలిసి మరికాసేపు క్రీజులో ఉండగలిగింటే..? ఛేదన సులవయ్యేది’’ అని వెల్లడించాడు. జంపా బౌలింగ్ అనగానే కోహ్లీకి ఎక్కడలేని ఊపొస్తుంటుంది. ఆ క్రమంలో ఎన్నోసార్లు అతనికి వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో.. మూడో టీ20లోనూ ఫించ్ అదే ప్లాన్ వేశాడు. కానీ.. కోహ్లీకి బదులు పాండ్యా చిక్కాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.