యాప్నగరం

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు రోహిత్ ఔట్.. సిరాజ్‌కు లక్కీ ఛాన్స్!

Border Gavaskar Trophyలో భాగంగా భారత జట్టు ఆసీస్ గడ్డ మీద నాలుగు టెస్టులు ఆడనుండగా.. ఫిట్‌నెస్ కారణాల రీత్యా రోహిత్, ఇషాంత్ తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు.

Samayam Telugu 24 Nov 2020, 2:54 pm
ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరమయ్యారు. ఐపీఎల్ 2020లో గాయాలపాలైన వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ పొందుతున్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సమయంలో రోహిత్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురయ్యాడు. డిసెంబర్ 8 వరకు అతడు ఫిట్ కాబోడని ఎన్‌సీఏ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
Samayam Telugu rohit-siraj


డిసెంబర్ 8న రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లినప్పటికీ.. మరో రెండు వారాలు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. దీంతో డిసెంబర్ 22 వరకు రోహిత్ బరిలో దిగడం కుదరదు. దీంతో జనవరి 7 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టుకు మాత్రమే అతడు అందుబాటులో ఉంటాడు. ఒకవేళ రోహిత్ టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా వైదొలిగితే శ్రేయస్ అయ్యర్‌ జట్టుతో చేరే అవకాశం ఉంది.

ఇక ఇషాంత్ విషయానికి వస్తే.. తొలి టెస్టు ఆడటం కోసం అతడు వెంటనే ఆస్ట్రేలియా బయల్దేరాల్సి ఉంటుంది. కానీ అతడికి ఫిట్‌నెస్ సమస్యలతోపాటు మ్యాచ్ ప్రాక్టీస్ సైతం ఉండదు. టీ20ల్లో అయితే 4 ఓవర్లు బౌలింగ్ చేస్తే సరిపోతుంది. కానీ టెస్టు క్రికెట్ ఆడటానికి ఇషాంత్‌కు మరింత ఫిట్‌నెస్ అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇషాంత్ ఇప్పటికిప్పుడు బయల్దేరి వెళ్లకపోతే రెండు టెస్టులకు దూరమవుతాడు.

భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. కార్తీక్ త్యాగి, కమలేష్ నాగర్‌కోటి, ఇషాన్ పారెల్ రూపంలో రిజర్వ్ బౌలర్లు కూడా అందుబాటులో ఉన్నారు. తొలి రెండు టెస్టులకు ఇషాంత్ దూరమైతే.. హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.