యాప్నగరం

ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఫలితాన్ని శాసించిన లాస్ట్ బాల్

నాగ్‌పూర్ వేదికగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం జరిగిన 2వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా...

TNN 30 Jan 2017, 12:24 am
నాగపూర్ వేదికగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం జరిగిన 2వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ భారత్‌ని నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులకే కట్టడీ చేయగలిగింది. అనంతరం 145 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేయగలిగింది.
Samayam Telugu india vs england 2nd t20i india beats england by 5 runs
ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఫలితాన్ని శాసించిన లాస్ట్ బాల్


చివరి ఓవర్‌లో విజయం ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ... ఇంగ్లండ్ మరో 5 పరుగులు సాధించాల్సి వుండగానే 20 ఓవర్లు పూర్తి కావడంతో టీమిండియా ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ గెలవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చెరో విజయంతో
ఇరు జట్లు సమానం అయ్యాయి. దీంతో ఈ సిరిస్ విజయం బుధవారం బెంగుళూరులో జరగనున్న 3వ మ్యాచ్ ఫలితంపై ఆధారపడింది.

మ్యాచ్ విజయంలో త్రిమూర్తుల పాత్ర :
టీమిండియా తరుపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ 47 బంతుల్లో రాబట్టిన 71 పరుగులు టీమిండియా మొత్తం స్కోర్‌లో కీలకం కాగా ఆశిష్ నెహ్రా, జస్ప్రిత్ బుమ్రాల బౌలింగ్ టీమిండియా విజయంలో మరో ముఖ్యపాత్ర పోషించాయి. 8 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా కేవలం 144 పరుగులు మాత్రమే చేయడంతో ఇక ఈ మ్యాచ్ గెలవడం కూడా కష్టం అనే అంచనాకు వచ్చేశారు టీమిండియా ఫ్యాన్స్. అయితే, అదే సమయంలో తమ మాస్టర్ క్లాస్ బౌలింగ్‌లో విజృంభించిన ఆశిష్ నెహ్రా (3/28), జస్ప్రిత్ బుమ్రా (2/20) ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్‌ని కట్టడీ చేయడంలో సఫలం అయ్యారు.

థ్రిల్లింగ్ ఫినిషింగ్‌కి బాటలు వేయడంలో టీమిండియా ఓల్డ్ హార్స్ ఆశిష్ నెహ్రా ముందడుగేశాడు. 17వ ఓవర్‌లో నెహ్రా చేతికి బంతి రాకముందు ఇంగ్లండ్ విజయానికి 24 బంతుల్లో 32 పరుగులు అవసరం. తన ఓవర్‌లో కేవలం 5 పరుగులే ఇచ్చి ఇంగ్లండ్ పరుగులకి కళ్లెం వేసిన నెహ్రా 5 వ బంతికి ఇంగ్లండ్ డేంజర్ మ్యాన్ అయిన బెన్ స్టోక్ (38)ని కూడా పెవిలియన్ బాటపట్టించాడు. ఆ తర్వాత ఓవర్ తీసుకున్న బుమ్రా కూడా నాలుగు బంతులు డాట్ బాల్స్ విసిరి తన ఓవర్‌లో కేవలం 3 సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఓవర్‌లో బాధ్యతలు తీసుకున్న నెహ్రానే ఈసారి
ఓ 4, 6 సమర్పించుకుని ఇంగ్లండ్‌ని మళ్లీ విజయానికి చేరువచేశాడు.

ఫలితాన్ని శాసించిన లాస్ట్ ఓవర్ :
దీంతో ఇక లాస్ట్ ఓవర్‌లో అసలు టెన్షన్ మొదలైంది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 6 బంతులకి 8 పరుగులు అవసరం అయ్యాయి. అదే ఓవర్‌లో బుమ్రా మొదటి బంతికే జో రూట్ వికెట్, 4వ బంతికి జోస్ బట్లర్‌ల వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి బంతి 6 కొడితే కానీ ఇంగ్లండ్‌కి విజయం సాధ్యం కాదు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ చూపులన్నీ బుమ్రా విసరబోయే ఆ చివరి బంతిపై, క్రీజులో వున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొయీన్ అలీ బ్యాట్‌పైనే వున్నాయి. యస్.. టీమిండియా ఫ్యాన్స్ ఆశించినట్టుగానే బుమ్రా మొయీన్ అలీని కట్టడీ చేయడంతో టీమిండియా ఈ మ్యాచ్‌ని సొంతం చేసుకోగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఈ మ్యాచ్‌ని గెలుపొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.