యాప్నగరం

Virat Kohli కోసం రూల్స్ బ్రేక్ చేసిన అభిమాని.. కెప్టెన్ సమయస్ఫూర్తి!

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. కెప్టెన్‌ను కలిసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన విరాట్ వెనకడుగు వేశాడు.

Samayam Telugu 25 Feb 2021, 12:33 pm

ప్రధానాంశాలు:

  • మొతేరా స్టేడియంలో గ్రౌండ్లోకి దూసుకొచ్చిన అభిమాని
  • కోహ్లి దగ్గరకు పరిగెత్తుకెళ్లిన ఫ్యాన్
  • వెనకడుగు వేసి.. వెళ్లిపోమన్న కెప్టెన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu virat kohli
Image: Twitter
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత స్పిన్నర్ల ధాటికి 113 పరుగులకే కుప్పకూలింది. బదులుగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ 57 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. రహానే ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు.
తొలి రోజు ఆఖరి ఓవర్లో జాక్ లీచ్.. విరాట్ కోహ్లిని బౌల్డ్ చేయడంతో భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. కాగా తొలి రోజు మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీని తప్పించుకొని.. బయోబబుల్‌ నిబంధనలను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకొచ్చాడు. కోహ్లిని కలవడం కోసం అతడు గ్రౌండ్లోకి వచ్చేయగా.. బయోబబుల్ రూల్స్‌ను దృష్టిలో ఉంచుకొని కోహ్లి వెనక్కి వెనక్కి జరిగాడు.
మైదానంలోకి వచ్చిన అభిమానిని వెనక్కి వెళ్లాలని సూచించాడు. తన తప్పిదాన్ని గ్రహించిన ఆ ఫ్యాన్.. వెనక్కి మళ్లగా.. స్టేడియంలోని మిగతా అభిమానులు కేరింతలు కొట్టారు.

బయో బబుల్ ప్రొటోకాల్స్ ప్రకారం.. ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ ఎవర్నీ కలవడానికి వీల్లేదు. శిక్షణ సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా స్టేడియంలో సామర్థ్యంలో సగం మంది అభిమానులకే అనుమతిస్తున్నారు.

స్టేడియంలోకి వచ్చిన అభిమాని ఎవరనే విషయమై ఆరా తీస్తున్నామని జీసీఏ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని.. చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.