యాప్నగరం

వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన కోహ్లి, జాదవ్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.

TNN 15 Jan 2017, 9:46 pm
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 351 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 11 బంతులు ఉండగానే చేధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి, స్థానిక ఆటగాడు కేదార్ జాదవ్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 351 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 24 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింంది. తర్వాత వచ్చిన యువీ, ధోనీ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 63 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంగ్లండ్ జట్టు సంబరాలు చేసుకుంది. కానీ.. కోహ్లి, జాదవ్ వీరోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 200 పరుగులు జోడించడంతో భారత్ రేసులోకి వచ్చింది. కోహ్లి 105 బంతుల్లో 122 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 65 బంతుల్లోనే సెంచరీ సాధించిన జాదవ్.. 76 బంతుల్లో 120 రన్స్ చేశాడు. కోహ్లితో కలసి జాదవ్.. భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
Samayam Telugu india vs england first odi live score kohli and jadhav centuries helped india tio win the match
వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన కోహ్లి, జాదవ్


వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న జాదవ్ తొడ కండరాలు పట్టేయడంతో పరుగులు తీయడానికి జాదవ్ ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ.. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ.. ఇంగ్లండ్ బౌలర్లతో ఆటాడుకున్నాడు. జాదవ్ అవుటయ్యే సమయానికి భారత్ 39.5 ఓవర్లలో 291 పరుగులు చేసింది. విజయానికి మరో 60 పరుగులు అవసరమైన దశలో.. జడేజా, హార్ధిక్ పాండ్య సమయోచితంగా ఆడారు. జట్టు విజయానికి చేరువ అవుతున్న సమయంలో జడేజా 13 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో భారత్ 44.1 ఓవర్లలో 18/7గా నిలిచింది. పాండ్య (40)తో జత కట్టిన అశ్విన్ (15) సిక్సర్ బాది భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.

అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. ఇంగ్లిష్ ఓపెనర్ జాన్సన్ రాయ్ 73 పరుగులు, జో రూట్ 78 రన్స్ రాణించారు. 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ స్టోక్స్ 40 బంతుల్లోనే 62 రన్స్ చేసి ఇంగ్లండ్ భారీ స్కోరు చేసేందుకు కారణమయ్యాడు. భారత బౌలర్లలో బుమ్రా, హార్ధిక్ పాండ్య చెరో రెండు వికెట్లు తీసుకోగా... ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.

2009 తర్వాత ప్రతి ఏడాది మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం భారత్‌కు అలవాటుగా మారగా.. కొత్త కెప్టెన్ కోహ్లి ఈసారి ఈ ఆనవాయితీని మార్చివేశాడు. జాదవ్‌తో కలిసి అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. భారత్ ఖాతాలో మూడో అత్యధిక పరుగుల ఛేజింగ్‌ రికార్డు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.