యాప్నగరం

Joe Root సంచలన బౌలింగ్.. ఆరు ఓవర్లలో సీన్ రివర్స్.. 145 రన్స్‌కే కుప్పకూలిన కోహ్లి సేన

England Captain జో రూట్ బంతితో భారత్‌కు షాకిచ్చాడు. 6.2 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసిన రూట్.. భారత్ బ్యాటింగ్‌ను పేకమేడలా కూల్చాడు.

Samayam Telugu 25 Feb 2021, 4:20 pm
మొతేరా వేదికగా భారత్‌, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లిష్ జట్టు బౌలింగ్‌లో అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 112 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ స్పిన్నర్లు రూట్, లీచ్ దెబ్బకు భారత్ 145 పరుగులకే కుప్పకూలింది. 3 వికెట్ల నష్టానికి 99 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. రూట్ ఐదు వికెట్లు తీయడంతో మరో 46 పరుగులకే మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది.
Samayam Telugu FILE PHOTO: Englands Joe Root


ఆట ప్రారంభమైన కాసేపటికే రహానేను పెవిలియన్ చేర్చిన లీచ్.. కాసేపటికే రోహిత్ శర్మ (66)ను ఔట్ చేశాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో.. రంగంలోకి దిగిన కెప్టెన్ జో రూట్ బంతితో మాయ చేశాడు. తొలి బంతికే రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన రూట్.. తర్వాత ఒకే ఓవర్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ను పెవిలియన్ చేర్చాడు. మూడు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే రూట్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లను ఔట్ చేసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు.

భారత్ 131 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన దశలో భారీ షాట్‌కు యత్నించిన రవిచంద్రన్ అశ్విన్ (17) జో రూట్ బౌలింగ్‌లోనే జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చివర్లో బుమ్రాను ఎల్బీగా పెవిలియన్ చేర్చిన రూట్.. భారత్‌ను 145 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రూట్ టెస్టు కెరీర్లో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంగ్లాండ్ కెప్టెన్ కేవలం 6.2 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.