యాప్నగరం

వాంఖడేలో కోహ్లి హిట్.. కివీస్ టార్గెట్ 281

న్యూజిలాండ్‌తో ముంబయిలోని వాంఖడే మైదానంలో ఆదివారం జరుగుతున్న తొలి వన్డేలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి

TNN 22 Oct 2017, 5:38 pm
న్యూజిలాండ్‌తో ముంబయిలోని వాంఖడే మైదానంలో ఆదివారం జరుగుతున్న తొలి వన్డేలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి సత్తాచాటాడు. కెరీర్‌లో 200వ వన్డే ఆడుతున్న కోహ్లి (121: 125 బంతుల్లో 9x4, 2x6) సమయోచిత శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా.. మిడిలార్డర్ తడబడినా.. సుమారు మూడు గంటల పాటు ఒంటరిగా క్రీజులో పోరాడిన కోహ్లి భారత్‌కి మెరుగైన స్కోరు అందించాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీయగా.. టిమ్ సౌథీ మూడు, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.
Samayam Telugu india vs new zealand 1st odi kohli ton carries india to 280
వాంఖడేలో కోహ్లి హిట్.. కివీస్ టార్గెట్ 281


టాస్ గెలిచిన విరాట్ కోహ్లి మరో ఆలోచన లేకుండా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్‌ (9: 12 బంతుల్లో 1x4) ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో పెవిలియన్ చేరిపోగా.. తర్వాత ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది మంచి ఊపు మీద కనిపించిన రోహిత్ శర్మ (20: 18 బంతుల్లో 2x6) కూడా ఆరో ఓవర్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. తాను వేసిన వరుస ఓవర్లలో ట్రెంట్ బౌల్ట్ ఈ ఓపెనర్లని ఔట్ చేసి భారత్‌ని ఒత్తిడిలో నెట్టాడు. ఈ దశలో క్రీజులో నిలిచిన కోహ్లి.. కేదార్ జాదవ్ (12: 25 బంతుల్లో 1x4)తో కలిసి కాసేపు ఇన్నింగ్స్ చక్కదిద్దినా.. జట్టు స్కోరు 71 వద్ద అతనూ శాంట్నర్ బౌలింగ్‌లో ఔటైపోయాడు.

కానీ.. చాలా రోజుల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్ (37: 47 బంతుల్లో (4x4) కాసేపు కెప్టెన్‌కి సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కి అర్ధశతకం భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. కార్తీక్‌ని ఔట్ చేసి సౌథీ ఈ జోడిని విడదీయగా.. అనంతరం వచ్చిన ధోనీ (25: 42 బంతుల్లో 2x4)తో మళ్లీ కోహ్లి అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌ కోలుకుంది. చివర్లో హార్దిక్ పాండ్య (16: 16 బంతుల్లో 1x4, 1x6), భువనేశ్వర్ కుమార్ (26: 15 బంతుల్లో 2x4, 2x6) బ్యాట్ ఝళిపించడంతో భారత్ 280 పరుగులు చేయగలిగింది.

వన్డే కెరీర్‌లో కోహ్లికి ఇది 31వ శతకం కాగా.. శతకాల జాబితాలో ఇక కోహ్లి కంటే ముందు 49 శతకాలతో సచిన్ తెందుల్కర్ మాత్రమే ఉన్నాడు. ఈ సెంచరీతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 30 శతకాల రికార్డుని కోహ్లి అధిగమించాడు. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ తర్వాత.. 200వ వన్డేలో శతకం బాదిన క్రికెటర్‌గా కోహ్లి రికార్డుల్లో నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.